Politics

లగ్జరీ వాచ్‌ల కుంభకోణం…పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు-NewsRoundup-Sep 27 2024

లగ్జరీ వాచ్‌ల కుంభకోణం…పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు-NewsRoundup-Sep 27 2024

* ప్రపంచ దేశాల్లో కలకలం సృష్టించిన ప్రాణాంతక మంకీపాక్స్‌ (ఎంపాక్స్‌) కేసుల సంఖ్య భారత్‌లో మూడుకు చేరింది. కేరళలో మరో మంకీ పాక్స్‌ కేసు నమోదైనట్లుగా ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మంకీపాక్స్‌ లక్షణాలతో ఆస్పత్రిలో చేరినట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. అతడి నమూనాలను పరీక్షల కోసం పంపించగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. భారత్‌లో సెప్టెంబర్‌ 9న తొలి మంకీపాక్స్‌ కేసు నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడి నమూనాలు పరీక్షించగా.. అది పశ్చిమ ఆఫ్రికాలో వ్యాప్తిలో ఉన్న క్లేడ్‌-2 రకంగా నిర్ధరించిన విషయం తెలిసిందే. అనంతరం యూఏఈ నుంచి కేరళకు వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్‌ నిర్థారణ అయినట్లుగా సెప్టెంబర్ 18న కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం 122 దేశాల్లో 99,518 మంకీ పాక్స్‌ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) ప్రకటించింది. దీంతో ఇది ప్రపంచ దేశాలకు పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హెల్త్ ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మహమ్మారి ఆఫ్రికా దేశాల్లో విస్తృతంగా వ్యాపిస్తుండడంతో అక్కడ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించినట్లుగా అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

* హైదరాబాద్‌ నగరంలో పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లపై జీహెచ్‌ఎంసీ నిషేధం విధించింది. వాల్‌ పోస్టర్లతోపాటు గోడలపై రాతలను కూడా నిషేధించింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలీ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

* దైవ దర్శనానికి వెళ్తామంటే అడ్డుకునే ప్రయత్నం చేయడం దేశంలో ఎప్పుడూ జరిగి ఉండదని అని వైకాపా అధినేత జగన్‌ (YS Jagan)అన్నారు. తిరుమల పర్యటన రద్దుపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్‌ తిరుమల పర్యటనకు అనుమతి లేదని మా పార్టీ నేతలకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ చూడలేదు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భాజపా శ్రేణులను రప్పిస్తున్నారు. లడ్డూల అంశాన్ని పక్కదారి పట్టించేందుకు డిక్లరేషన్ అంశాన్ని తీసుకొచ్చారు. తిరుమల లడ్డూపై చెప్పినవన్నీ అబద్ధాలని రుజువులు కనిపిస్తున్నాయి. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అసత్యాలు చెబుతున్నారు. తిరుమల పవిత్రతను, శ్రీవారి ప్రసాదాన్ని రాజకీయం చేస్తున్నారు’’ అని జగన్‌ ఆరోపించారు.

* ఆయన మాపై లైంగికదాడి చేశారు.. 60 మంది మహిళల ఆవేదన. హరోడ్స్‌ మాజీ యజమాని మహ్మద్‌ అల్‌ ఫయేద్‌ లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బ్రిటన్‌ కోర్టు మెట్లెక్కిన 60 మంది మహిళలు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం
బాధితులు ఇంకా ఎక్కువ మందే ఉంటారని కోర్టుకు వెల్లడించిన బాధితురాళ్ల తరఫు న్యాయవాదులు. బ్రిటన్‌లో లగ్జరీ డిపార్ట్‌మెంటల్‌స్టోర్‌గా గుర్తింపు తెచ్చుకున్న హరోడ్స్‌. గతంలో దీనికి యజమానిగా వ్యవహరించిన అల్ ఫయేద్‌.

* జగన్ హయాంలోనే తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. లడ్డూలకు వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ల్యాబ్‌లో నిర్ధరణ అయిందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన నిజానిజాలు ప్రజలకు తెలియాలని డిమాండ్‌ చేశారు. మళ్లీ తప్పు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై పీసీసీ అధ్యక్షురాలిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి తాను లేఖ రాసినట్లు తెలిపారు. లడ్డూ కల్తీ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని కోరామన్నారు.

* ఈ నెల 30న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భాజపా 24 గంటల రైతు రుణమాఫీ అమలు సాధన దీక్ష చేపట్టనుంది. ఇందిరా పార్క్ వద్ద చేయనున్న దీక్షా స్థలిని భాజపా శాసన సభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఎన్వీ సుభాష్, పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు.

* నగరంలోని మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది. సుమారు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎవరికీ తెలియకుండా విద్యార్థులకు యాజమాన్యం ట్రీట్‌మెంట్‌ చేయిస్తోంది. దీనిపై తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వలేదు.

* భారత్‌లో క్రికెట్‌ అభిమానులే ఎక్కువ. ఇతర క్రీడల ఆటగాళ్లకు గుర్తింపు తక్కువే. ఈ నేపథ్యంలో హాకీ ఆటగాళ్లకు ఎదురైన ఓ నిరాశాజనకమైన సంఘటనను పంచుకున్నాడు భారత హాకీ మిడ్‌ ఫీల్డర్‌ హార్దిక్‌ సింగ్‌. ఎయిర్‌పోర్టులో హాకీ ఆటగాళ్లను పట్టించుకోకుండా సోషల్‌ మీడియా స్టార్‌ డాలీ చాయ్‌వాలాతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపినట్లు తెలిపాడు.

* దేశ రాజధానిలో గాలి కాలుష్యాన్ని అరికట్టడంలో ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ (CAQM) విఫలం కావడంపై సుప్రీం కోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. పంట వ్యర్థాలను కాల్చడం విషయంలో.. ఎటువంటి కమిటీలు ఏర్పాటు చేయలేదని, గతంలో కమిషన్‌ చెప్పినవన్నీ గాల్లో మాటలుగా కనిపిస్తున్నాయని పేర్కొంది.

* ప్రముఖ ఇ-మెయిల్‌ సర్వీస్‌ జీమెయిల్‌ (Gmail) సేవల్లో గూగుల్‌ సరికొత్త ఫీచర్‌ తీసుకొచ్చింది. సందర్భోచితంగా సమాధానం పంపేందుకు స్మార్ట్‌ రిప్లై సదుపాయాన్ని జోడించింది. దీని సాయంతో ఇకపై ప్రత్యుత్తరం పంపడం సులభం కానుంది.

* జపాన్‌ (Japan) ప్రధానమంత్రి ఫుమియో కిషిద వారసుడిగా మాజీ రక్షణమంత్రి షిగెరు ఇషిబా (Shigeru Ishiba) ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన అధికార లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎల్‌డీపీ) అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. దీంతో వచ్చేవారం ఇషిబా దేశ 102వ ప్రధానమంత్రి (Japan Prime Minitser)గా బాధ్యతలు చేపట్టనున్నారు.

* జగన్ హయాంలోనే తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. లడ్డూలకు వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ల్యాబ్‌లో నిర్ధరణ అయిందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన నిజానిజాలు ప్రజలకు తెలియాలని డిమాండ్‌ చేశారు. మళ్లీ తప్పు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై పీసీసీ అధ్యక్షురాలిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి తాను లేఖ రాసినట్లు తెలిపారు. లడ్డూ కల్తీ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని కోరామన్నారు.

* వైకాపా అధినేత జగన్‌ను (YS Jagan) తిరుమలకు వెళ్ల వద్దని ఎవరూ చెప్పలేదని, ర్యాలీలు, జనసమీకరణలు చేయొద్దని మాత్రమే చెప్పామని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. తిరుమల అంశంపై జగన్‌ చేసిన ఆరోపణలు ఖండించారు. వెలగపూడిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. నోటీసులు ఇచ్చారు, నిలుపుదల చేశారని ఆరోపిస్తున్నారు.. జగన్‌కు ఏమైనా పోలీసులు నోటీసులు ఇచ్చారా? అని ప్రశ్నించారు. జగన్‌ను వెళ్లొద్దని నోటీసులు ఇస్తే.. మీడియాకు చూపించాలని డిమాండ్‌ చేశారు. అబద్ధాలు ప్రచారం చేస్తూ.. ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.

* ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin gadkari) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజ సేవ, దేశ నిర్మాణం, అభివృద్ధికి పర్యాయపదంగా ఒకప్పటి రాజకీయాలు ఉండేవని, ఇప్పుడంతా పవర్‌ పాలిటిక్సే నడుస్తున్నాయంటూ పేర్కొన్నారు. రాజస్థాన్‌ గవర్నర్‌ హరిభౌ కిసన్‌రావ్ బగాడే సన్మాన కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం మాట్లాడారు. తాను ఆరెస్సెస్స్‌ కార్యకర్తగా పనిచేసిన రోజులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

* పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తి మరణించాడు. దీంతో గ్రామస్థులు పోలీసులపై మూక దాడికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మొరాదాబాద్‌కు చెందిన సోనూ అనే వ్యక్తి అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డాడని సమాచారం అందింది. అరెస్టు చేయడానికి పోలీసులు అతడి ట్రాక్టర్‌ను వెంబడించారు. వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా సోనూ ప్రమాదవశాత్తూ ఆ వాహనంపై నుంచి పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసుల వల్లే అతడు మరణించాడని ఆరోపిస్తూ వారిపై రాళ్లు రువ్వుతూ, దాడులకు పాల్పడ్డారు. పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఠాకూర్‌ద్వారా-జస్పూర్ రహదారిని దిగ్బంధించారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ‘‘ఇవి చాలా తీవ్రమైన ఆరోపణలు..ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నాం. ఘటనలో ప్రమేయమున్న నలుగురు పోలీసులపై కేసు నమోదు చేశాం. తదుపరి విచారణ కొనసాగుతోంది’’ అని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

* అమీన్‌పూర్‌ చెరువుకు సంబంధించిన కేసు విషయంలో విచారణ చేపట్టిన హైకోర్టు.. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు నోటీసులు జారీ చేసింది. హైడ్రా కమిషనర్‌ సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అమీన్‌పూర్‌ చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉందని ఇటీవల ఓ భవనాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని చెప్పినా పట్టించుకోకుండా కూల్చేశారని బాధితుడు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై హైడ్రా కమిషనర్‌ వివరణ ఇవ్వాలని సూచించిన హైకోర్టు.. నేరుగా లేదా ఆన్‌లైన్‌ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

* చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే పవిత్రమైన పాఠశాలను కొందరు అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మార్చుకున్నారు. పాఠశాలలోనే మద్యం తాగుతూ, బార్‌ డ్యాన్సర్లతో కలిసి అసభ్యకర నృత్యాలతో వేడుకలు చేసుకున్నారు. బిహార్‌లోని సహర్సా జిల్లా జలాయి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

* మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. లగ్జరీ వాచ్‌ల కుంభకోణం నేపథ్యంలో అధికారులు ఈ సోదాలు చేపట్టారు. ఆయన ఇల్లు, ఫామ్‌హౌజ్‌ తదితర ఐదు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన కుమారుడు హర్ష రెడ్డికి కస్టమ్స్‌ అధికారులు నోటీసులు ఇచ్చారు. సింగపూర్‌ నుంచి చెన్నై పోర్టుకు ఖరీదైన వాచ్‌లు వచ్చినట్లు గుర్తించారు. అలోకం నవీన్‌ కుమార్‌ మధ్యవర్తిగా ఫహెర్దీన్‌ ముబీన్‌ నుంచి వాచ్‌లను హర్ష కొనుగోలు చేసినట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. విచారణలో అలోకం నవీన్‌ రూ.100 కోట్ల విలువైన వస్తువులు స్మగ్లింగ్‌ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై మనీలాండరింగ్‌ సహా మరో కేసు నమోదు చేసిన ఈడీ విచారణ చేపట్టింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z