* టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ (Airtel) మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.16,124.6 కోట్ల నికర లాభం నమోదైనట్లు తన రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2876 కోట్లతో పోలిస్తే ఈ మొత్తం దాదాపు ఐదింతలు పైనే కావడం విశేషం. ఇండస్ టవర్స్ వ్యాపారం కలిసిరావడం, టారిఫ్ల పెంపు వంటివి లాభాల పెరుగుదలకు దోహదం చేశాయి. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సైతం గతేడాదితో పోలిస్తే 19 శాతం వృద్ధి చెందింది. రూ.37,899.5 కోట్ల నుంచి రూ.45,129.3 కోట్లకు పెరిగింది. టెల్కోల ఆదాయాలకు కొలమానంగా భావించే నెలలో ఒక యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం ఏకంగా రూ.245కి చేరింది.
* టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. సైబర్ మోసాలు, సైబర్ నేరగాళ్లు విపరీతంగా పెరిగిపోతున్నారు. ఫేక్ యాప్స్, ఫేక్ మెసేజ్లతో ప్రజలను దోచేస్తున్నారు. ఇలాంటి మోసాల భారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది.ఇందులో భాగంగానే మొబైల్ ఫోన్లలో కాలర్ ట్యూన్ ద్వారా హెచ్చరిస్తోంది. తాజాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తన పాలసీదారులకు, కస్టమర్లకు హెచ్చరిక నోటీసు జారీ చేసింది.”లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేరుతో మోసపూరిత మొబైల్ అప్లికేషన్లు చెలామణి అవుతున్నాయని మా దృష్టికి వచ్చింది” అని పేర్కొంటూ ఎల్ఐసీ పరిస్థితిని స్పష్టం చేసింది. ఫేక్ యాప్స్ నమ్మితే.. మోసపోతారని సంస్థ వెల్లడించింది. అంతే కాకుండా మీ వ్యక్తిగత సమాచారం.. ఆర్థిక లావాదేవీలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పింది.పాలసీదారులు, కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలి. మీ లావాదేవీలు అధికారిక మార్గాల ద్వారా మాత్రమే పూర్తయ్యేలా చూసుకోవాలని ఎల్ఐసీ పేర్కొంది. సేవల కోసం అధికారిక వెబ్సైట్ లేదా డిజిటల్ యాప్ వంటి వాటితో పాటు వారి వెబ్సైట్లో జాబితా చేసిన.. ఇతర చెల్లింపు గేట్వేలను మాత్రమే ఉపయోగించాలి. ఇతర ఫేక్ యాప్స్ ఉపయోగించి చెల్లింపు చేస్తే.. దానికి సంస్థ బాధ్యత వహించదని స్పష్టం చేసింది.1956లో ప్రారంభమైన ఎల్ఐసీ.. ప్రభుత్వ మద్దతుతో కూడిన కార్పొరేషన్ సంస్థ. ఇది రక్షణ, పొదుపు, పెట్టుబడి కోసం అందించే పాలసీలతో సహా విస్తృత శ్రేణి జీవిత బీమా అందిస్తుంది. అకాల మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు వ్యక్తులు & కుటుంబాలకు ఆర్థిక భద్రత, మద్దతును అందించడం మాత్రమే కాకుండా దీర్ఘకాలికంగా పొదుపు, సంపద సృష్టిని ప్రోత్సహించడం ఎల్ఐసీ ప్రధాన ఉద్దేశ్యం.
* బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. రోజుకో రికార్డు స్థాయికి చేరుతూ ఆల్టైమ్ హైల్లోనే కదలాడుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం ఒక్కరోజే దేశంలోని ప్రధాన నగరాల్లో తులం వెయ్యి రూపాయలకుపైగా ఎగబాకింది. అయితే అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఢిల్లీ మార్కెట్ మూతబడగా.. హైదరాబాద్ మార్కెట్లో మాత్రం 10 గ్రాముల మేలిమి బంగారం విలువ ఎప్పుడూ లేనివిధంగా తొలిసారి రూ.87,000లను తాకడం గమనార్హం. పెండ్లిళ్ల సీజన్ కావడంతో రాబోయే రోజుల్లో ఇంకా పెరగవచ్చన్న సంకేతాలున్నాయి.
* విదేశాలకు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాను బాకీపడినదాని కన్నా ఎక్కువ సొమ్మును బ్యాంకులు తన నుంచి రాబట్టుకున్నాయని ఆరోపించారు. తాను బ్యాంకులకు రూ.6,200 కోట్లు బాకీ ఉన్నానని, తన నుంచి రూ.10,200 కోట్లు రాబట్టుకున్నాయని తెలిపారు. తనతోపాటు, యునైటెడ్ బ్రీవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (యూబీహెచ్ఎల్, ప్రస్తుతం లిక్విడేషన్లో ఉంది), ఇతర సర్టిఫికెట్ రుణగ్రస్థుల నుంచి రాబట్టుకున్న సొమ్ము వివరాలను తెలియజేయాలని కోరారు. తన నుంచి రూ.14,000 కోట్లు రాబట్టినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు తెలిపారని చెప్పారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, బ్యాంకులకు నోటీసు జారీ చేసింది. ఈ నెల 13 నాటికి సమాధానం చెప్పాలని ఆదేశించింది. మాల్యా ఈ పిటిషన్ను ఈ నెల 3న దాఖలు చేశారు.
* దేశీయ కరెన్సీకి మరిన్ని చిల్లులుపడ్డాయి. అంతర్జాతీయ వాణిజ్యయుద్ధానికి అమెరికా కాలు దుయ్యనుండటంతో డాలర్ కరెన్సీ అనూహ్యంగా బలపడుతున్నది. దీంతో ఇతర కరెన్సీలు ఢీలా పడుతున్నాయి. దీంట్లోభాగంగా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ బుధవారం ఒకేరోజు 36 పైసలు కోల్పోయి చారిత్రక కనిష్ఠ స్థాయి 87.43 వద్దకు జారుకున్నది. అమెరికా-చైనా దేశాల మధ్య టారిఫ్ల యుద్ధం మరింత ముదురుతుండటంతో రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నదని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z