NRI-NRT

సింగపూర్ లో శివ భక్తి గీతాలాపన..

సింగపూర్ లో శివ భక్తి గీతాలాపన..

“శ్రీ సాంస్కృతిక కళాసారథి”- సింగపూర్ సంస్థ ఆధ్వర్యంలో
మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా “శివ భక్తి గీతాలాపన” ప్రత్యేక కార్యక్రమాన్ని అంతర్జాల మాధ్యమంలో శనివారం నిర్వహించారు.

శ్రీ కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ “తమ సంస్థ గతంలో చేసిన ఎన్నో కార్యక్రమాలకు అతిథిగా విచ్చేసి ఆప్యాయంగా ఆశీస్సులు అందించిన, ఇటీవల శివైక్యం చెందిన ప్రముఖ నటిమణి జమున గారికి, మరియు కళాతపస్వి కె. విశ్వనాథ్ గారికి
నివాళిగా ఈ కార్యక్రమాన్ని అంకితం చేస్తున్నామని” తెలియజేశారు. సింగపూర్లో నివసించే గాయనీ గాయకులు శివ భక్తి కీర్తనలను మధురంగా ఆలపించారు. వాటిలో త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, దయానంద సరస్వతి విరచిత కీర్తనలు, లలిత గీతాలు, సాగర సంగమం శంకరాభరణం వంటి విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలనుండి, జమున నటించిన నాగులచవితి సినిమా నుండి కూడా పాటలు ఎంపిక చేసుకుని ఆలపించడం విశేషం.

ఆత్మీయ అతిథిగా వంశీ వ్యవస్థాపకులు శిరోమణి డా.వంశీ రామరాజు పాల్గొని శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. వంశీ గౌరవాధ్యక్షురాలు అయిన జమున మరియు విశ్వనాథ్ గార్లతో తమకున్న ఆత్మీయ అనుబంధాన్ని గూర్చి తలచుకున్నారు. వారి పేర్లపై త్వరలో అవార్డులు స్థాపించి కళాకారులను ప్రోత్సహిస్తామని తెలియజేశారు

రాధిక మంగిపూడి కార్యక్రమాన్ని నిర్వహించగా గాయనీ గాయకులుగా శైలజ చిలుకూరి, సౌభాగ్య లక్ష్మి తంగిరాల, శేషు కుమారి యడవల్లి, శేషశ్రీ వేదుల, రాధిక నడాదూర్, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, అనంత్ బొమ్మకంటి, ఉషా గాయత్రి నిష్ఠల, పద్మజ వేదుల, కిరీటి దేశిరాజు తదితరులు వివిధ శివ భక్తి సంకీర్తనలను మధురంగా ఆలపించారు.

రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సారధ్యంలో యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమాన్ని క్రింది లింకు ద్వారా వీక్షించవచ్చు.

https://youtube.com/live/Wj7xMJ3My80