బాలిక వివాహాలు అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు రూపొందించి ఎన్నో సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్నా పలు గ్రామాల్లో గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని ఓ తండాలో శుక్రవారం రాత్రి బాల్య వివాహం జరిగింది. తండాకు చెందిన బాలిక(13)కు, ఫకీరాబాద్కు చెందిన సాహెబ్రావు (42) అనే వ్యక్తితో వివాహం జరిపారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు, అధికారులు గ్రామానికి వెళ్లే సరికి సాహెబ్రావు బాలికను తీసుకుని వెళ్లిపోయాడు. ఈ క్రమంలో పెళ్లి అడ్డుకునేందుకు వచ్చిన అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. డీసీపీవో చైతన్య కుమార్ ఆధ్వర్యంలో శనివారం తండాకు వెళ్లి విచారణ చేపట్టారు. బాల్య వివాహం చేసుకున్న వ్యక్తితో పాటు పెళ్లికి సహకరించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కార్యదర్శి హైమద్ నవీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకున్న వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్హెల్ప్లైన్ ప్రాజెక్టు సమన్వయకర్త జోత్స్న దేవి, ఐసీడీఎస్ సూపర్వైజర్ భాగ్యలక్ష్మి, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు శోభ తదితరులు పాల్గొన్నారు.