Politics

అమిత్ షాతో బండి సంజయ్ భేటీ

అమిత్ షాతో బండి సంజయ్ భేటీ

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సోమవారంనాడు భేటీ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకున్న తర్వాత అమిత్ షాను బండి సంజయ్ సమావేశం కావడం ఇదే తొలిసారి.తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై అమిత్ షాతో బండి సంజయ్ చర్చించినట్టుగా సమాచారం.బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను ఆ పార్టీ తప్పించింది. బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆ పార్టీ నాయకత్వం నియమించింది. దీంతో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఈ నెల 21న బాధ్యతలు స్వీకరించారు.

కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో బండి సంజయ్ బీజేపీ నేతలపై పరోక్ష విమర్శలు చేశారు. తప్పుడు రిపోర్టులు పంపొద్దని కోరారు. కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేసుకొనివ్వాలని కోరారు. తనపై పార్టీలోని కొందరు నేతలు అధిష్టానానికి తప్పుడు ఫిర్యాదులు చేశారని బండి సంజయ్ చెప్పకనే చెప్పారు.బండి సంజయ్ పనితీరును ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు గతంలో పలుమార్లు అభినందించిన విషయం తెలిసిందే.2024 ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక ఎంపీ సీట్లతో పాటు ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడంపై బీజేపీ వ్యూహరచన చేస్తుంది. ఈ నెల మొదటి వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలతో హైద్రాబాద్ లో సమావేశమయ్యారు. దక్షిణాది రాష్ట్రాల నేతలకు దిశా నిర్ధేశం చేశారు. దక్షిణాదిలో వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సంస్థాగత మార్పులకు ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. ఈక్రమంలోనే బండి సంజయ్ ను తప్పించారని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.