NRI-NRT

న్యూ జెర్సీ: సాయి దత్త పీఠంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

న్యూ జెర్సీ: సాయి దత్త పీఠంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ప్రపంచ వ్యాప్తంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయంలో జెండా వందనం చేసిన ఎడిసన్ మేయర్

వేడుక‌ల్లో పాల్గొన్న‌ స్థానిక రాజ‌కీయ నాయ‌కులు, ప్రముఖులు

ఎడిసన్: న్యూ జెర్సీ ఆగస్ట్ 15:77వ భారత స్వాతంత్య్ర దినోత్సవం పురసర్కరించుకుని భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 వసంతాలు నిండి 77 వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా, ఈ వేడుకల‌ను అమెరికాలో ప్ర‌వాసులు ఘనంగా జరుపుకున్నారు.

న్యూజెర్సీ రాష్ట్రంలోని, ఎడిసన్ ఓక్ ట్రీ రోడ్ లో ఉన్న సాయిదత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయంలో శ్రీ రఘుశర్మ శంకరమంచి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ వేడుక‌ల్లో ఎడిసన్ మేయర్ సామ్ జోషి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ మాన్ అజయ్ పాటిల్, కమీషనర్ ఉపేంద్ర చివుకుల, మాజీ ఆర్మీ అధికారులు, రోజా శంకరమంచి ,UBLOOD ఫౌండర్ డాక్టర్ జగదీశ్ యలమంచిలి టీం , ఏ.పీ. బీజేపీ సెక్రటరీ పాతూరి నాగ భూషణం, కృష్ణారెడ్డి , డాక్టర్ జనార్దన్ బొల్లు , డాక్టర్ అనీష్ , ప్రదీప్ కొఠారి, రాజీవ్ బాంబ్రీ, మాటా అధ్యక్షులు శ్రీనివాస్ గనగోని, ఆటా సభ్యులు విలాస్ జంబుల, TFAS అధ్యక్షులు మధు రాచకుళ్ల, TTA సభ్యులు, దీపిక (వాస్తు), సాయి దత్త పీఠం డైరెక్టర్లు ,వాలంటీర్స్, మువ్వన్నెల జెండాను చేతబ‌ట్టి వందేమాతరం, భారతమాత కీ జై అంటూ నినాదాలు చేశారు.

అమెరికాలో భారతీయులు ఎక్కువగా ఉండే ప్రాంతం ఎడిసన్ అని, భారతదేశం గర్వపడే పనులు ప్రవాసులు చేయాలని పిలుపునిచ్చారు స్థానిక‌ మేయర్ సామ్ జోషి. ఇది అత్యంత భావోద్వేగ క్షణం అంటూ స్వాతంత్య్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం ఫౌండర్ శ్రీ రఘుశర్మ శంకరమంచి మాట్లాడుతూ.. భారతమాత బానిస సంకెళ్లను తొలగించుకుని స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్న ఈ శుభదినాన్ని, మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా దేవాలయ ప్రాంగణంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సంద‌ర్భంగా భార‌తీయులంద‌రికి శుభాకాంక్ష‌లు తెలిపారు.