Sports

భారత్-ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మూడో టీ20కి వర్షం అంతరాయం

భారత్-ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మూడో టీ20కి వర్షం అంతరాయం

భారత్-ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మూడో టీ20కి వర్షం అంతరాయం కలిగిస్తోంది. షెడ్యూల్ ప్రకారం 7.30 గంటలకే ప్రారంభం కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం డబ్లిన్‌లో వర్షం పడుతోంది. దాంతో ఇంకా టాస్ కూడా పడలేదు. వర్షం ఆగితే తప్పా మ్యాచ్ జరిగే అవకాశాలు లేవు. కనీసం ఐదు ఓవర్ల ఆట సాధ్యమైతేనే మ్యాచ్ నిర్వహిస్తారు. లేకుంటే రద్దు చేస్తారు.

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లను గెలిచిన టీమిండియా 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. గాయాల నుంచి కోలుకుని పునరాగమనం చేసిన పేస్‌ బౌలర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ట ఫిట్‌నెస్‌ను నిరూపించు‌కున్నారు. మరోవైపు రిజర్వ్‌ ఆటగాళ్లను పరీక్షించేందుకు ఈ నామమాత్రమైన మ్యాచ్‌ టీమిండియా వాడుకోనుంది.

అవేష్‌ ఖాన్‌, జితేశ్‌ శర్మ, షాబాజ్‌ అహ్మద్‌ ఇప్పటివరకు సిరీస్‌లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. నిజానికి విండీస్‌ పర్యటనలోనూ జట్టులో ఉన్న అవేష్‌ ఖాన్ మొత్తంగా వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో బెంచ్‌కు పరిమితం కావాల్సివచ్చింది. ఈ నేపథ్యంలో నిలకడగా రాణించలేకపోతున్న అర్ష్‌దీప్‌ సింగ్‌ స్థానంలో అతన్ని తుది జట్టులోకి తీసుకునే చాన్స్ ఉంది.

సంజు శాంసన్‌కు విశ్రాంతినిచ్చి వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మకు అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వొచ్చు. దేవధర్‌ ట్రోఫీలో విశేషంగా రాణించి ఆత్మవిశ్వాసంతో ఉన్న షాబాజ్‌ అహ్మద్‌ భారత్‌కు మరో ఆల్‌రౌండ్‌ ప్రత్యామ్నాయం. వాషింగ్టన్‌ సుందర్‌కు విశ్రాంతి కల్పించి షాబాజ్‌ను ఆడించే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఆసియాకప్‌కు ముందు కెప్టెన్‌ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ మరింత మ్యాచ్‌ టైమ్‌ కోరుకుంటున్న నేపథ్యంలో వారికి విశ్రాంతినిచ్చే అవకాశం లేదు. ఇక సంజు స్థానంలో జితేశ్‌ను ఆడించడం మినహా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు ఉండే అవకాశం లేదు. రెండో టీ20తో అరంగేట్రం చేసిన రింకూ 21 బంతుల్లో 38 పరుగులతో ఆకట్టుకున్నాడు.

అతనితో పాటు యశస్వి, రుతురాజ్‌ గైక్వాడ్‌లు తమదైన ముద్ర వేయాలనుకుంటున్నారు. ఇక ఐర్లాండ్‌ తరఫున ఎడమచేతి వాటం స్పిన్నర్‌ వాన్‌ వోర్కమ్‌ అరంగేట్రం చేయొచ్చు. తిరుగులేని ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న భారత్‌ను క్లీన్‌స్వీప్‌ చేయకుండా అడ్డుకోవడం ఐర్లాండ్‌కు కష్టమైన పనే.