తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సర్కార్ పచ్చజెండా ఊపింది. తెలంగాణలో డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2,575 ఎస్జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టుల భర్తీకి అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈసారి టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా గతంలో మాదిరిగా జిల్లా ఎంపిక కమిటీలు(డీఎస్సీ) నియామకాలు చేపడతాయని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ ప్రకారం టెట్లో క్వాలిఫై అయిన వారంతా టీఆర్టీకి పోటీ పడేందుకు అర్హులు. అందులో అర్హత సాధించిన వారి వివరాలతో జిల్లాలవారీ జాబితాను రూపొంచి డీఎస్సీకి పంపుతారు. అనంతరం ఆయా జిల్లాల డీఎస్సీలు నియామకాలు చేపడతాయని చెప్పారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) సెప్టెంబరు 15న నిర్వహిస్తామన్న ఆమె.. అదే నెల 27న ఫలితాల వెల్లడించనున్నట్టు తెలిపారు. ఆ తర్వాత వెంటనే నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు. అలాగే, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ఇటీవలే కాంట్రాక్ట్ విధానంలో 1,264 బోధన, బోధనేతర ఖాళీలను భర్తీచేశామని.. ప్రాజెక్టు అయినందున కాంట్రాక్ట్ విధానంలో నియమించామని చెప్పారు. అయితే, కేజీబీవీల్లో సిబ్బందిని క్రమబద్ధీకరించడం కుదరదని మంత్రి తేల్చి చెప్పారు. గురుకులాల్లో 12,150 బోధన, బోధనేతర ఖాళీల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
567మంది ఒప్పంద ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ
సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఒప్పంద టీచర్లను క్రమబద్ధీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒప్పంద టీచర్ల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 567మంది ఒప్పంద ఉపాధ్యాయులను క్రమబద్ధీకరిస్తూ ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. 16 ఏళ్లుగా ఒప్పంద పద్ధతిలో కొనసాగుతున్న ఉపాధ్యాయులను క్రమబద్ధీకరిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తంచేశారు.