Fashion

గోళ్లపై మచ్చలకు చాలా కారణాలు ఉన్నాయి

గోళ్లపై మచ్చలకు చాలా కారణాలు ఉన్నాయి

మీ గోళ్ళపై తెల్లటి మచ్చలు ఉండటాన్ని చాలా సార్లు మీరు గమనించి ఉంటారు. దానంతట అదే వచ్చి అదే చడీచప్పుడు చేయకుండా పోతుంది. అందువల్ల దీని గురించి ఎవరూ ప్రత్యేకంగా ఆందోళన చెందరు. అసలు ఇవి ఎందుకు వస్తాయి? అనే విషయం చాలా మందికి తెలియదు. నిజానికి చేతి గోళ్లపై కనిపించే ఈ తెల్లమచ్చలు మన శరీరంలో వివిధ వ్యాధుల ఉనికికి సంకేతాలన ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి మీ వేళ్లపై కూడా ఈ విధమైన తెల్ల మచ్చలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి. లేదంటే ప్రమాదం సంభవించవచ్చు. ముఖ్చంగా ల్యుకోనిచియా వల్ల ఈ తెల్లమచ్చలు చేతి వేళ్ల గోళ్లపై కనిపిస్తాయి. అలాగే గోళ్లపై ఈ తెల్లమచ్చలు రావడం వెనుక మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. గోళ్ళపై తెల్లటి మచ్చలు రావడానికి ప్రధాన కారణాలు ఏవంటే..

*** అలర్జీల వల్ల వస్తాయి
హెల్త్‌లైన్ ప్రకారం.. కొన్నిసార్లు నెయిల్ పాలిష్, నెయిల్ పాలిష్ రిమూవర్ ఉపయోగించడం వల్ల కూడా గోళ్లపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. నిజానికి నెయిల్‌ రిమూవర్‌లో కొన్ని హానికారక రసాయనాలు ఉంటాయి. ఇవి గోళ్లతో చర్య జరిపి గోళ్లకు హాని కలిగిస్తాయి. దీని వల్ల తెల్ల మచ్చలు ఏర్పడతాయి.

*** ఫంగల్ కారణాలు
ఒనికోమైకోసిస్ అనే ఫంగస్ గోరు ఉపరితలంపై సులభంగా వ్యాపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ప్రాథమిక లక్షణం గోళ్ళపై తెల్లటి మచ్చలు ఏర్పడటం. ఇది త్వరగా గోరుపై వ్యాపిస్తుంది. గోరు క్రమంగా పెళుసుగా మారుతుంది.

*** గాయాల వల్ల కూడా..
చాలా సార్లు గాయాల వల్ల గోళ్ల ఉపరితలం దెబ్బతింటుంది. ఫలితంగా గోళ్లపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. గోళ్లు పెరిగే కొద్దీ అవి కూడా పెరుగుతూ ఉంటాయి. సాధారణంగా చేతి వేళ్ల మూలల్లో, చేతికి దెబ్బతగలడం, డెస్క్‌లో పడి వేళ్లు నలిగిపోవడం వంటి మొదలైన వాటి వల్ల ఇలా చేతి వేళ్లకు గాయాలు సంభవిస్తాయి.

*** అతిగా మానిక్యూర్ చేసుకోవడం
రెగ్యులర్ మానిక్యూర్ చేయడం వల్ల అధిక ఒత్తిడి కారణంగా గోళ్ల సమస్యలు తలెత్తుతాయి. అధిక ఒత్తిడితో మానిక్యూర్‌ చేయించుకోవడం మానేయాలి. ఫలితంగా వేళ్ల గోళ్లపై ఒత్తిడి పడదు.

*** కొన్ని రకాల మందుల వాడకం
కొన్నిసార్లు మనం వినియోగించే మందుల వల్ల కూడా గోళ్లపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఉదాహరణకు.. క్యాన్సర్ చికిత్స సమయంలో కీమోథెరపీ చేయించుకన్న తర్వాత ఈ విధంగా గోళ్లపై తెల్లమచ్చలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే మూత్రపిండాల వైఫల్యం, గుండె జబ్బులు, రక్తహీనత, మధుమేహం మొదలైన వ్యాధుల వల్ల కూడా ఇలా జరుగుతుంది.

*** శరీరంలో మినరల్స్ లోపించడం
శరీరంలో జింక్, కాల్షియం తగిన మోతాదులో లేకపోవడం వల్ల గోళ్లపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. అందువల్ల సమతులాహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి. అటువంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయడానికి బదులుగా వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించాలి.