DailyDose

మావోయిస్టు కీలక సభ్యుడు అరెస్ట్-నేరవార్తలు

మావోయిస్టు కీలక సభ్యుడు అరెస్ట్-నేరవార్తలు

* మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సందీప్‌ దీపక్‌రావును అరెస్టు చేసినట్టు డీజీపీ అంజనీ కుమార్‌ తెలిపారు. అరెస్టు వివరాలను డీజీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘‘పలువురు మావోయిస్టు అగ్రనేతలతో దీపక్‌రావు సమావేశాలు జరిపారు. పశ్చిమ కనుమల ప్రత్యేక జోనల్‌ కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ టైజంక్షన్‌ ఏరియాలో కీలకంగా వ్యవహరించారు. ఈఏడాది అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న దీపక్‌రావు రెండు..మూడు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. కచ్చితమైన సమాచారంతో అరెస్టు చేశాం. అతని కోసం మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక పోలీసులు, ఎన్‌ఐఏ బృందాలు గాలిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం దీపక్‌పై రూ.25లక్షల రివార్డు ప్రకటించింది’’ అని డీజీపీ వెల్లడించారు.

* టాలీవుడ్‌లో కలకలం రేపుతున్న డ్రగ్స్‌ కేసు (Drug bust in Hyderabad)లో సినీ నటుడు నవదీప్‌ (Navdeep)కు స్వల్ప ఊరట లభించింది. ఈకేసులో నిందితులు బాలాజీ, వెంకటరత్నం ఇచ్చిన సమాచారంతో రాంచంద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. నవదీప్‌ పేరు బయటకు వచ్చిందని టీఎస్‌ న్యాబ్‌ డైరెక్టర్‌ సీవీ ఆనంద్‌ గురువారం వెల్లడించారు. దీంతో నవదీప్‌ ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఈనెల 19వరకు నవదీప్‌ను అరెస్టు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్‌ పిటిషన్ పై కౌంటరు దాఖలు చేయాలని పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

* గుంటూరులో నిర్వహించిన ఎస్సై దేహదారుఢ్య పరీక్షలో అపశ్రుతి చోటుచేసుకుంది. పరుగు పోటీలో పరుగెత్తుతూ మోహన్‌ అనే ఎస్సై అభ్యర్థి సొమ్మసిల్లి పడిపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువకుడిని హుటాహుటిన జీజీహెచ్‌కు తరలించారు. మోహన్‌ను పరీక్షించి వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్థారించారు.

* చోరీ కేసులో నిందితుడైన వరుడి పెళ్లి జరుగుతుండగా పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు. (Groom arrested for theft) ఈ గొందరగోళ పరిస్థితుల్లో వరుడి సోదరుడ్ని వధువు పెళ్లాడింది. విస్తూపోయే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ జిల్లాలో జరిగింది. ఒక మద్యం షాపు, క్యాంటీన్ నుంచి 35 డబ్బాల్లో ఉన్న మద్యం సీసాలు, ఇతర వస్తువులు చోరీ అయ్యాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు జరిపారు. చోరీ జరిగిన సంఘటనా స్థలం నుంచి ఒక బైక్‌, మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా దొంగతనానికి పాల్పడిన నిందితుడ్ని ఫైజల్‌గా గుర్తించారు.

* సంగారెడ్డి జిల్లాలో విషాదం నెల‌కొంది. టెట్ ప‌రీక్ష రాసేందుకు వ‌చ్చిన ఓ గ‌ర్భిణి మృతి చెందింది. ప‌టాన్‌చెరు మండ‌లం ఇస్నాపూర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌లో టెట్ పేప‌ర్-1 ప‌రీక్ష రాసేందుకు రాధిక(గ‌ర్భిణి) వ‌చ్చింది. ప‌రీక్ష‌కు వెళ్లే తొంద‌ర‌లో వేగంగా ప‌రీక్ష గ‌దికి ఆమె చేరుకుంది. దీంతో ఆమెకు బీపీ ఎక్కువై ప‌రీక్ష గ‌దిలోనే ప‌డిపోయింది. అక్క‌డే ఉన్న‌ భ‌ర్త అరుణ్ ఆమెను హుటాహుటిన ప‌టాన్‌చెరు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి తీసుకెళ్లాడు. అప్ప‌టికే రాధిక మృతి చెందిన‌ట్లు వైద్యులు ధృవీక‌రించారు. దీంతో అరుణ్ భార్య మృత‌దేహం వ‌ద్ద గుండెల‌విసేలా రోదించాడు.

* గ‌త కొద్దినెల‌లుగా దేశ‌వ్యాప్తంగా ఆన్‌లైన్ స్కామ్‌లు (Cyber Fraud) పెరుగుతున్నాయి. రోజుకోత‌ర‌హా స్కామ్‌తో సైబ‌ర్ నేర‌గాళ్లు అమాయ‌కుల‌ను అడ్డంగా దోచేస్తున్నారు. లేటెస్ట్‌గా ఢిల్లీకి చెందిన ఓ వ్య‌క్తి స్కామ‌ర్ల బారిన‌ప‌డి ఏకంగా రూ. ల‌క్ష పైగా న‌ష్ట‌పోయాడు. సోష‌ల్ మీడియాలో బిగ్‌బ‌జార్ స్పెష‌ల్ డిస్కౌంట్ యాడ్‌ను క్లిక్ చేసిన వ్య‌క్తి స్కామ‌ర్ల చేతిలో మోస‌పోయాడు. బిగ్‌బ‌జార్ స్టోర్ పేరుతో 75 శాతం డిస్కౌంట్ ఆఫ‌ర్ చేసిన యాడ్‌పై ఢిల్లీకి చెందిన 28 ఏండ్ల వ్య‌క్తి క్లిక్ చేశాడు. ఆపై నాలుగు వస్తువుల‌ను అత‌డు కొనుగోలు చేయ‌గా అవి డెలివ‌రీ కాలేదు. ఈ వ‌స్తువుల‌ను కొనుగోలు చేసేందుకు బాధితుడు త‌న ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డు వినియోగించ‌గా ఆపై అత‌డి డెబిట్ కార్డు హ్యాక్ కావ‌డంతో రూ. ల‌క్ష న‌ష్ట‌పోయాడు. ఫేస్‌బుక్ యాడ్‌పై తాను క్లిక్ చేసి ఐటెమ్స్‌ను కొనుగోలు చేయ‌గా ఏ డెలివరీ ఏజెన్సీ వాటిని త‌న‌కు డెలివ‌ర్ చేయ‌లేద‌ని ఎఫ్ఐఆర్‌లో బాధితుడు వాపోయాడు. అలిఖాన్‌, మాన్‌సూన్ ఆఫ‌ర్స్ పేరుతో ఇదే త‌ర‌హా ఆఫ‌ర్లు ఫేస్‌బుక్‌లో క‌నిపించాయ‌ని, త‌న ఖాతా నుంచి డ‌బ్బు డిడ‌క్ట్ అయిన‌ట్టు త‌న‌కు మూడు టెక్ట్స్ మెసేజ్‌లు వ‌చ్చాయ‌ని చెప్పాడు. త‌న డెబిట్ కార్డును హ్యాక్ చేసిన స్కామ‌ర్లు ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ. 40,000, రూ. 39,900, రూ. 40,000 చొప్పున లావాదేవీలు జ‌రిపార‌ని పేర్కొన్నాడు. డ‌బ్బు డిడ‌క్ట్ అయిన‌ట్టు టెక్ట్స్ మెసేజ్‌లు రావ‌డంతో మోస‌పోయాన‌ని గ్ర‌హించిన తాను వెంట‌నే త‌న డెబిట్ కార్డును బ్లాక్ చేసి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాన‌ని బాధితుడు వివ‌రించాడు.