Politics

హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేముంది?-తాజావార్తలు

హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేముంది?-తాజావార్తలు

* హైదరాబాద్‌ పదేళ్లపాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని, ఏపీకి సంబంధించిన అంశంపై ఇక్కడ నిరసన జరపొద్దు అంటే ఎలా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. నిరసనలు చేయవద్దన్న కేటీఆర్‌ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. “చంద్రబాబు అరెస్టు ఏపీకి మాత్రమే సంబంధించింది కాదు. చంద్రబాబు దేశ నాయకుడు. ఆయన అరెస్టుపై తెలంగాణలో నిరసనలు తెలపడంలో తప్పేముంది. నిరసన తెలిపే వాళ్లంతా ఇక్కడి ఓటర్లే. నిరసనకారులను నియంత్రించడంలో అర్థం లేదు. నిరసన తెలిపే హక్కును ఎవరూ కాలరాయలేరు. ఏ పార్టీ వాళ్లైనా నిరసన తెలిపే హక్కు ఉంది. ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేముంది? ఉద్యమ సమయంలో అమెరికాలోనూ నిరసనలు జరిగాయి. ఏం హక్కు ఉందని అమెరికాలో నిరసనలు చేశారు? ప్రతి సమస్యకు దిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్నారు?ఏం హక్కు ఉందని దిల్లీలో నిరసనలు చేశారు?” అని రేవంత్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ఒకేసారి విడుదల చేయబోమని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అభ్యర్థుల ప్రకటన విడతల వారీగా ఉంటుందన్నారు. మైనంపల్లి కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. మైనంపల్లి హన్మంతరావు గురువారం కాంగ్రెస్‌లో చేరుతారని రేవంత్‌ వెల్లడించారు.

* గణేశ్‌ శోభాయాత్ర, నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్ రోస్, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ సీవీ ఆనంద్‌తో కలిసి నిమజ్జనం, శోభాయాత్ర ఏర్పాట్లను మంత్రి ఏర్పాట్లను పరిశీలించారు. చార్మినార్ నుంచి ప్రత్యేక బస్సుల్లో ఉస్మాన్ గంజ్, మోజంజాహీ మార్కెట్, ఆబిడ్స్, లిబర్టీ, తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌లో ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేసే క్రేన్ నంబర్‌ 4 వద్దకు చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు.

* సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. అక్టోబర్‌ 28న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎల్‌సీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అక్టోబర్‌ 6, 7 తేదీల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆ తర్వాత స్క్రూటిని, విత్‌డ్రాకు అవకాశం ఇవ్వనున్నారు. 28న పోలింగ్‌ నిర్వహించనుండగా.. అదేరోజు కౌంటింగ్‌ చేపట్టనున్నారు. అయితే, మే 22న సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర కార్మిక సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే, వరుసగా పండగలు ఉండడంతో వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది. సింగరేణి సంస్థ అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు.. అక్టోబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.

* మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో పెద్ద ఎత్తున గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్ర మీదుగా మంచిర్యాల జిల్లాకు అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని శ్రీరాంపూర్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామగుండం సీపీ రెమా రాజేశ్వరి ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రాపరి గ్రామానికి చెందిన డ్రైవర్‌ జగబంధు క్రిసాని(22), చిత్రాసేన్‌ క్రిసాని(23) ట్రాక్టర్‌లో ఈ నెల 23న గంజాయిని తీసుకొస్తున్నారు. శ్రీరాంపూర్‌లో జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ టైర్‌ పంక్చర్‌ అయ్యింది. దీంతో నిందితులు ట్రాక్టర్‌ను వదిలి పారిపోయారు. పెట్రోలింగ్‌ పోలీసులు ట్రాక్టర్‌ను శ్రీరాంపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆతర్వాత ట్రాక్టర్‌ లో తనిఖీ చేయగా, సిమెంట్‌ ఇటుకల కింద 93 గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. 465 కిలోల గంజాయిగా గుర్తించి, దీని విలువ సుమారు రూ.93 లక్షల వరకు ఉంటుందని నిర్ధారించారు. ట్రాక్టర్‌లో దొరికిన పత్రాల ఆధారంగా నిందితులను గుర్తించారు.

* పంజాబ్‌లోని మొహాలి జిల్లా కురాలి గ్రామంలో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. గ్రామంలోని పెయింట్ ఫ్యాక్ట‌రీలో బుధ‌వారం అగ్నిప్ర‌మాదం చోటుచేసుకోవ‌డంతో ఐదుగురికి గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల్లో ఒక‌రిని మొహాలి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా మిగిలినవారిని స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

* చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్-2023 పోటీల్లో తెలంగాణ బిడ్డ మెరిసింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ టీం ఈవెంట్ (షూటింగ్)లో ఈషా సింగ్ బృందం స్వర్ణ పతకం సాధించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈషా సింగ్ బృందం 1,759 పాయింట్లతో భారత్‌కు గోల్డ్ మెడల్ సాధించి, టీమ్ స్పిరిట్‌ను చాటిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అమలుచేస్తున్న పటిష్ట కార్యాచరణే జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికల్లో తెలంగాణ క్రీడాకారులు కనబరుస్తున్న ప్రతిభకు నిదర్శనమని సీఎం అన్నారు. తెలంగాణ క్రీడాకారులు రానున్న రోజుల్లో మరెన్నో పతకాలు సాధించి, తెలంగాణ ఖ్యాతిని జగద్వితం చేయాలని సీఎం ఆకాంక్షించారు.

* బీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని కోడకండ్ల మండలం రామేశ్వరం గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

* తనపై స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కుంభకోణం కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్‌పై విచారణను అక్టోబర్ మూడో తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద గవర్నర్ అనుమతి తీసుకోకుండా తనపై ఏపీ సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టులో ఎస్ఎల్‌పీ దాఖలు చేశారు. అంతకుముందు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ గత శుక్రవారం హైకోర్టు జస్టిస్ కే శ్రీనివాసరెడ్డి తీర్పు ఇచ్చారు. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ శనివారం సుప్రీంకోర్టులో ఎస్ఎల్‌పీ దాఖలు చేశారు. తొలుత చంద్రబాబు పిటిషన్‌పై విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు జస్టిస్ ఎస్వీఎన్ భట్టి విముఖత ప్రదర్శించారు. దీంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ వద్ద చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లుథ్రా ప్రస్తావించారు. తక్షణం కేసు లిస్టింగ్ చేయాలని కోరారు. చంద్రబాబు బెయిల్ కోరుకుంటున్నారా? అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించినప్పుడు.. తాము బెయిల్ కోరుకోవడం లేదని లుథ్రా అన్నారు. ‘చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను త్వరితగతిన కేసు లిస్టింగ్ చేయాలని మా తొలి అభ్యర్థన. మధ్యంతర రిలీఫ్ కల్పించాలని రెండో అప్పీల్. అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ సెక్షన్ అంటే కేసు మూలాలపై చర్చించాల్సిన అంశం. ఎఫ్ఐఆర్ ప్రకారం చంద్రబాబును కస్టడీలో పెట్టదగిన కేసు కాదు. మేం బెయిల్ కోరుకోవడం లేదు’ అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు సిద్ధార్థ లుథ్రా తెలిపారు. ‘దిగువ కోర్టు న్యాయమూర్తిని సంయమనం పాటించాలని చెప్పలేం. జడ్ క్యాటగిరీ, ఎన్ఎస్‌జీ సెక్యూరిటీ గల వ్యక్తిని ఇలా ట్రీట్ చేస్తారా.. ఇది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛతో కూడిన అంశం. యశ్వంత్ సిన్హా కేసులో వ్యక్తి స్వేచ్ఛపై అన్ని విషయాలు చేర్చారు. కానీ ఈ కేసులో చంద్రబాబును కస్టడీకి అప్పగించాలని ఏపీ సీఐడీ పోలీసులు కోరుతున్నారు. దాని నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నాం’ అని లుథ్రా వాదించారు.

* ప్రజలు అప్పులు చేసి మరీ ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకోవడం మానుకోవాలని కర్ణాటక (Karnataka) సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) అన్నారు. చామరాజనగర్‌లోని ఎం.ఎం. హిల్స్‌ దేవాలయంలో నిర్వహించిన సామూహిక వివాహాల వేడుకకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజలు బయట రుణాలు తీసుకొచ్చి ఆర్భాటంగా పెళ్లిళ్లు చేయడం ఎంత మాత్రం మంచి పద్ధతి కాదని చెప్పారు. కొందరు వ్యవసాయ రుణాలు తీసుకొని సమాజంలో పేరు కోసం ఘనంగా వివాహాలు చేస్తున్నారన్నారు. పేద, శ్రామిక వర్గాల ప్రజలు ఆడంబరాల కోసం చేసిన అప్పులను తీర్చడానికి జీవితాంతం కష్టపడాల్సి వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే సమాజం నిరాడంబరంగా జరిగే సామూహిక వివాహాలను ప్రోత్సహించాలని సీఎం పిలుపునిచ్చారు.

* తెలుగు సినీ నటుడు నాని నటించిన చిత్రాలను తాను ఎక్కువగా చూశానని ప్రముఖ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇతర భాషలతో పోలిస్తే తెలుగులో సూపర్ హీరోలు, స్టార్ హీరోలు ఎక్కువ మంది ఉన్నారని.. నాని అంటే తనకు ఇష్టమని అన్నారు. నాని సహజంగా యాక్ట్‌ చేస్తారని.. అది తనకెంతో నచ్చుతుందన్నారు. ఆయన నటించిన ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘జెర్సీ’, ‘ఈగ’ చిత్రాలను తాను చూశానని చెప్పారు.

* వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనం రోజు గణపయ్య లడ్డూ వేలంపాటలు ఆకట్టుకుంటున్నాయి. గచ్చిబౌలిలోని భూజ అపార్ట్‌మెంట్స్‌లో లడ్డూ భారీ ధర పలికింది. ఉన్నతి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎండీ ఈదులకంటి చిరంజీవి గౌడ్‌ వేలంపాటలో రూ.25.50 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు.

* నాసా (Nasa) వ్యోమగామి ఫ్రాంక్‌ రూబియో, రష్యా వ్యోమగాములు సెర్గే ప్రొకోపీవ్‌, దిమిత్రి పెటెలిన్‌లు తమ అంతరిక్ష యాత్రను విజయవంతంగా ముగించుకొని భూమిని చేరారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station) నుంచి సోయుజ్‌ ఎంఎస్‌-23 (Soyuz MS-23) స్పేస్‌ క్రాఫ్ట్‌లో బయలుదేరిన వీరు కజక్‌స్థాన్‌లో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యారు. ఈ ప్రయాణం 157.4 మిలియన్‌ మైళ్లు. వాస్తవానికి ఈ మిషన్‌ ఆరు నెలల్లోనే పూర్తి కావాల్సి ఉంది. అయితే, 2022 డిసెంబరులో రష్యన్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌లో ఊహించని లీక్‌ చోటు చేసుకోవడంతో గడువు పొడిగించారు. దాంతో వ్యోమగాములు అంతరిక్షంలో 371 రోజులు గడపాల్సి వచ్చింది.

* నగరంలో గణేశ్‌ నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఏకదంతుడి శోభాయాత్రలకు విఘ్నాలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. శోభాయాత్రలు సాగే దారుల్లో సాధారణ వాహనాల రాకపోకలకపై ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.

* టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ కేసులో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్థించింది. ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దు సబబేనని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ మళ్లీ నిర్వహించాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ టీఎస్‌పీఎస్సీ చేసిన అప్పీల్‌ను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కొట్టివేసింది.

* తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో యావత్ దేశానికి దిక్సూచిగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ లులు గ్రూపు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కూకట్‌పల్లిలో లులు గ్రూపు ఏర్పాటు చేసిన మాల్‌, హైపర్ మార్కెటింగ్ సెంటర్‌ను ఆ సంస్థ ఛైర్మన్ యూసుఫ్ అలీతో కలిసి మంత్రి కేటీఆర్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా లులు సంస్థకు అభినందనలు తెలిపారు.

* కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి మల్కాజిగిరి భారాస (BRS) టికెట్ దాదాపు ఖరారైన నేపథ్యంలో ఆయన ప్రచారం ప్రారంభించారు. అధిష్ఠానం సూచనతో ప్రచారం ప్రారంభించిన రాజశేఖర్ రెడ్డి ఆనంద్‌బాగ్ నుంచి మల్కాజిగిరి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. తన మామ మంత్రి మల్లారెడ్డితో కలిసి వచ్చిన ఆయనకు నియోజకవర్గ భారాస శ్రేణులు స్వాగతం పలికారు.

* తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu)దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. క్వాష్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు అక్టోబరు 3వ తేదీకి వాయిదా వేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని చంద్రబాబు ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు.

* లింగమనేనికి అనుకూలంగా రింగ్‌రోడ్డు తయారు చేశారని ఎలా చెబుతారని తెదేపా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. లేని రింగ్‌ రోడ్డుపై ఆర్కే ఫిర్యాదు చేస్తే సీఐడీ కేసు నమోదు చేసిందని ఆరోపించారు. హెరిటేజ్‌ కొన్న భూమి.. అమరావతికి 30 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. ‘ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టు- వాస్తవాలు’ అంశంపై ఆమె పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

* ప్రపంచకప్‌ వంటి (ODI WC 2023) మెగా టోర్నీలో విజయం సాధించాలంటే కేవలం గొప్ప సారథి ఉంటేనో లేదా వ్యక్తిగతంగా అద్భుతమైన ఆటగాళ్లు ఉంటే సరిపోదని మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌ వ్యాఖ్యానించాడు. జట్టుగా రాణిస్తేనే జట్టు ఛాంపియన్‌ అయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. 2011లో భారత్‌ గెలిచినప్పుడు అంతా ధోనీ మహిమగా చెబుతారు.