Politics

నాపై చేసిన దుష్ప్రచారాన్ని మరవను

నాపై చేసిన దుష్ప్రచారాన్ని మరవను

తన గురించి దుష్ప్రచారం చేశారని, ఈ అవమానాన్ని తాను ఎప్పటికీ మర్చిపోనని చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరం జామ్‌పేట లూథరన్‌ చర్చిలో చంద్రబాబు నాయుడు విడుదల కోసం ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టుపై శాంతియుత నిరసనలు తెలుపుతున్న వారిని పోలీసులు ఇబ్బందిపెట్టడం సరికాదన్నారు. మహిళల విషయంలోనూ దురుసుగా వ్యవహరించడం సరికాదన్నారు. తన విషయంలోనే చాలా దుష్ప్రచారం చేశారని.. వాటిని తాను మరిచిపోనన్నారు. తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. తానేంటే తన ఆత్మసాక్షికి తెలుసని.. ఈ విషయంలో తన భర్త నమ్మకం ఉంటే చాలని వ్యాఖ్యానించారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో సెప్టెంబర్ 9న అరెస్టైన చంద్రబాబు నాయుడు.. నాటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయనకు మద్ధతుగా టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అక్రమ కేసులతో చంద్రబాబును జైల్లో పెట్టారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.