Sports

ఆసియా క్రీడల్లో స్వర్ణాలు గెలిచిన భారత్-తాజావార్తలు

ఆసియా క్రీడల్లో స్వర్ణాలు గెలిచిన భారత్-తాజావార్తలు

* ఇజ్రాయెల్‌ (Israel)లో హమాస్‌ మిలిటెంట్ల (Hamas militants) హింసాత్మక దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) దీనిపై స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ప్రకటించారు. ‘‘ఇజ్రాయెల్‌లో ఉగ్రవాదులు భీకర దాడుల వార్తలు విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా. ఈ సమయంలో మా ఆలోచనలు, ప్రార్థనలన్నీ.. బాధిత పౌరులు, వారి కుటుంబాల గురించే. ఈ విపత్కర పరిస్థితుల్లో మేం ఇజ్రాయెల్‌కు అండగా నిలబడుతాం’’ అని మోదీ ట్వీట్ చేశారు.

* పశ్చిమ బెంగాల్‌ ( West Bengal)లో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భయాందోళనకు గురైన ఓ వ్యక్తి.. తనను కుట్టిన దోమల (mosquitoes)ను సేకరించి ఆసుపత్రికి తీసుకువచ్చాడు. దీంతో డాక్టర్‌తో సహ అక్కడున్నవారంతా ఆశ్యర్చపోయారు. ఈ ఘటన పుర్బా బర్దామన్‌ జిల్లాలో చోటు చేసుకుంది. మంగళకోట్‌కు చెందిన మన్సూర్ అలీ షేక్ అనే వ్యక్తి చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే, తన దుకాణం పక్కన నిల్వ ఉన్న నీటిలో దోమల బెడద పెరిగింది. దీంతో అతడు భయంతో తనను కుట్టిన దోమలను సేకరించి ఓ ప్లాస్టిక్‌ కవర్‌లో వేసుకుని నేరుగా స్థానిక ఆసుపత్రికి వచ్చాడు. వాటిని వైద్యుడికి చూపి.. ఈ దోమలను పరీక్షించి ముందస్తుగా తనకు సరైన వైద్యం చేయాలంటూ కోరాడు. దీంతో వైద్యుడు సహా అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ ఘటనపై స్పందించిన స్థానిక అధికారులు తక్షణమే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తామని తెలిపారు. అంతేకాకుండా దోమలు వృద్ధి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.

* ‘వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓడిపోయి తెదేపా అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏమిటి.. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించండి’ అని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఏపీకి జగన్‌ ఎందుకు కావాలి’ అనే అంశంపై వైకాపా జిల్లా స్థాయి సమావేశం ఒంగోలులో శుక్రవారం నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులు, సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, ముఖ్యనాయకులు హాజరయ్యారు. ఏపీకి జగన్‌ ఎందుకు కావాలంటూ కొన్ని అంశాలపై తొలుత జగనన్న సురక్ష రాష్ట్ర కన్వీనర్‌ శివ శంకర్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అనంతరం మాజీ మంత్రి బాలినేని మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే వైకాపా నాయకుల తాట తీస్తామంటూ జనసేన, తెదేపా నాయకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారని.. తెదేపా అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో పార్టీ శ్రేణులు ఆలోచించాలని వ్యాఖ్యానించారు.

* తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా, ఆయనకు మద్దతు తెలుపుతూ తెదేపా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘మోత మోగిద్దాం’ తరహాలో ‘కాంతితో క్రాంతి’ పేరుతో నిరసన చేపట్టింది. శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు తెదేపా నేతలు, కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు లైట్లు ఆపేసి, దీపాలు వెలిగించి నిరసన తెలిపారు. కొందరు రహదారిపై వెళ్తూ వాహనాల లైట్లు బ్లింక్‌ చేసి నిరసన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి, దిల్లీలో లోకేశ్‌ దీపాలు వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌ వద్ద ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపారు. దిల్లీలోని 50 అశోక రోడ్డులో ఎంపీ గల్లా జయదేవ్‌ నివాసం వద్ద లోకేశ్‌ చేపట్టిన నిరసన కార్యక్రమంలో వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు, తెదేపా పార్లమెంటరీ పార్టీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్‌, సేవ్‌ డెమొక్రసీ అంటూ నినాదాలు చేశారు.

* ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్‌లో భారత్- అఫ్గాన్ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. టాస్‌ ఓడి అఫ్గాన్‌ మొదట బ్యాటింగ్ చేసింది. అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో 18.2 ఓవర్లలో ఆట పూర్తయిన తర్వాత వరుణుడు అంతరాయం కలిగించాడు. అప్పటికి అఫ్గాన్‌ 112/5 స్కోరుతో ఉంది. వరుణుడు శాంతించకపోవడంతో మ్యాచ్‌ నిర్వహణ సాధ్యం కాదని తేల్చి టోర్నీలో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగిన భారత్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో టీమ్‌ఇండియా స్వర్ణ పతకం గెల్చుకోగా.. అఫ్గాన్‌ రజతం అందుకుంది. క్రికెట్‌లో భారత మహిళల జట్టు కూడా పసిడి పతకాన్ని గెల్చుకున్న సంగతి తెలిసిందే.

* తమ దేశంపై మెరుపుదాడికి దిగిన హమాస్‌ మిలిటెంట్ల (Hamas militants)ను ఇజ్రాయెల్‌ (Israel) దీటుగా ఎదుర్కొంటోంది. దీంతో ఇజ్రాయెల్‌ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని భారత పౌరుల (Indians)కు అక్కడి భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. అనవసరంగా బయటకు రావొద్దని హెచ్చరించింది. ‘‘ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారులు సూచించిన భద్రతా ప్రొటోకాల్స్‌ను పాటించాలి. అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దు. సురక్షిత శిబిరాలకు చేరువగా ఉండండి. అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీ సిబ్బందిని సంప్రదించండి’’ అని టెల్‌ అవివ్‌లోని భారత దౌత్యకార్యాలయం (Indian embassy) తమ అడ్వైజరీలో పేర్కొంది.

* స్వప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేశారని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జలాల వ్యవహారంలో పునఃపంపిణీ నిర్ణయం కచ్చితంగా రాష్ట్రానికి అన్యాయం చేయడానికేనని అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సీఎం జగన్‌ ఉత్తరం రాసి ఊరుకున్నారే తప్ప దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. విశాఖ ఉక్కు ఉత్పత్తి తగ్గిస్తూ.. దాని మనుగడ కోల్పోయేలా చేస్తున్నా చూస్తూ ఉండిపోయారని అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రంగాలను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై తక్షణమే స్పందించి అన్ని సంఘాలు, పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ చేపట్టాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

* జగన్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కుంటుపడిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసినందుకే తమ అధినేత చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. ‘లేని, వేయని ఇన్నర్‌ రిండ్‌రోడ్డులో అవినీతి ఎలా జరిగింది?’ అనే పుస్తకాన్ని పార్టీ నేతలతో కలిసి మంగళగిరిలో అచ్చెన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

* గాంధీభవన్‌ (Gandhi Bhavan) వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని (Rahul Gandhi) అవమానకరంగా చిత్రీకరించారంటూ డీసీసీ అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో భాజపాకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. అయితే, గాంధీభవన్‌ గేటువద్ద బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు.. పార్టీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.

* తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్టును నిరసిస్తూ.. తెదేపా-జనసేన సహా పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తలపెట్టిన ‘ధర్మాగ్రహ శాంతి ర్యాలీ’ ఉద్రిక్తంగా మారింది. శాంతిర్యాలీ నిర్వహించకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. బలగాలు భారీగా మోహరించినప్పటికీ.. చంద్రబాబు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పోలీసు వలయం ఛేదించుకొని ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నక్కా ఆనంద్‌బాబు, జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్‌, జనసేన నేత శ్రీనివాస్‌ యాదవ్‌, పెద్ద ఎత్తున మహిళా రైతులు పాల్గొన్నారు. ముందస్తు పిలుపు మేరకు లాడ్జి సెంటర్‌కు చేరుకున్న కార్యకర్తలు శాంతి ర్యాలీ నిర్వహించకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. లాడ్జిసెంటర్‌ నుంచి అరండల్‌పేట వరకు సుమారు 800 మంది పోలీసులు మోహరించి.. నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్టు చేశారని కార్యకర్తలు మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

* సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలపై కేంద్ర కార్మిక శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికలకు సింగరేణి యాజమాన్యం సహకరించడం లేదని కోర్టుకు తెలిపింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ తరఫున డిప్యూటీ చీఫ్ లేబర్‌ కమిషనర్‌ డి.శ్రీనివాసులు మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు. ‘‘గత నెల 27న సమావేశం ఏర్పాటు చేస్తే సింగరేణి యాజమాన్యం హాజరు కాలేదు. అంతేకాకుండా తుది ఓటరు జాబితాను కూడా సంస్థ ప్రకటించలేదు. కోర్టు ఆదేశాలతో అక్టోబరు 28న ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్‌ చేశాం. సింగరేణి యాజమాన్యం సహాయ నిరాకరణ వల్ల ముందుకు వెళ్లలేకపోతున్నాం’’ అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికలు నిర్వహించేలా తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి సంస్థ సహకరించేలా ఆదేశాలివ్వాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.

* ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మెస్‌ నిర్వహణ అధ్వానంగా ఉందంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నీళ్ల చారు, పులిసిపోయిన పెరుగు పెడుతున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. డైరెక్టర్‌ వచ్చి చెప్పినా ఆపకుండా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో క్యాంపస్‌ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

* సోమవారం విజయవాడలో వైఎస్సార్‌సీపీ పదాధికారుల సమావేశం జరగనుంది. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగే ఈ సభకు రాష్ట్ర నలమూలల నుంచి పార్టీ శ్రేణులు భారీగా హాజరుకానున్నారు. మొత్తం 8,222 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ కో ఆర్డినేటర్లు, సమన్వయకర్తలు, మున్సిపల్ ఛైర్మన్లు, మార్కెట్ యార్డు ఛైర్మన్లు, ఎంపీపీలు సహా పలువురు ప్రతినిధులు హాజరవ్వనున్నారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎన్నికలకు క్యాడర్‌ను సమాయత్తం చేయనున్నారు. రానున్న రోజుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనునున్నారు.

* రేపో, మాపో BRS మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు మంత్రి హరీష్​ రావు. ప్రజలకు ఇంకా ఏం చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా హ్యాట్రిక్ మాత్రం సీఎం కేసీఆర్ దే అన్నారు. BRS ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. రైతులకు 3 గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదన్నారు. త్వరలోనే బిడెకన్నే గ్రామాన్ని దత్తత తీసుకుంటానని చెప్పారు.

* ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ పతకాలు సెంచరీ దాటిపోయాయి. అందులో పురుషుల కబడ్డీ విభాగంలో స్వర్ణం పతకం కూడా ఉంది. ఇరాన్‌తో జరిగిన ఫైనల్‌లో భారత్ 33-29 తేడాతో (IND vs IRN) విజయం సాధించి గోల్డ్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఇరు జట్ల మధ్య మరొక నిమిషంలో మ్యాచ్‌ ముగుస్తుందనగా.. తీవ్రమైన హైడ్రామా చోటు చేసుకుంది. పాయింట్ల వద్ధ ఆటగాళ్లు పట్టుపట్టడంతో ఆటను దాదాపు గంటపాటు సస్పెండ్‌ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. చివరికి సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత భారత్‌ను విజేతగా ప్రకటించారు.

* రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) కామారెడ్డి నియోజకవర్గాన్నే ఎందుకు ఎంచుకున్నారని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కామారెడ్డి డిగ్రీ కళాశాల మైదానంలో మినీ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం కేటీఆర్‌ మాట్లాడారు. ఈ నియోజకవర్గం ఉద్యమ స్ఫూర్తిని తెచ్చిందని, పొత్తులో భాగంగా 2004లో కామారెడ్డి నియోజకవర్గాన్ని తీసుకున్నామని గుర్తు చేశారు.

* సొంత రాష్ట్రంలోనే భాజపాను గెలిపించుకోలేని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. తెలంగాణలో గెలిపిస్తారా? అని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకుంటే మీ పార్టీ పరువైనా దక్కుతుందని చురకలంటించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం పడ్తనపల్లిలో టీఎంసీ సామర్థ్యం ఉన్న ఎత్తిపోతల పథకానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.