NRI-NRT

లండన్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించిన కవిత

లండన్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించిన కవిత

తెలంగాణ ఎన్నారైలు, తెలంగాణ సంఘాలు కలిసి లండన్‌లో తొలిసారి ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రవాసుల మధ్య సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించి, ఐక్యతను పెంపొందించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. కమ్యూనిటీ సంస్థలు నిర్వహిస్తున్న సంస్కృతి, భాష, సేవా కార్యక్రమాలని ప్రశంసించారు. లండన్‌లోని బహుళ సంస్కృతిలో ప్రవాసులు తమ మూలాలను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

‘తెలంగాణ తల్లి విగ్రహం ఇంగ్లాండ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ సమాజ ఐక్యత, శక్తికి చిహ్నంగా నిలుస్తుంది. ఇది మన భాగస్వామ్య వారసత్వం, సమాజంగా మనల్ని బంధించే విలువలను గుర్తుచేస్తూ, స్ఫూర్తిదాయకమైన దీపస్తంభంగా పనిచేస్తుందని’ ఆమె తెలిపారు. తెలంగాణ సమాజానికి గర్వకారణం, వారసత్వ చిహ్నమైన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణను ప్రకటించినందుకు సంతోషిస్తున్నామని తెలంగాణ ప్రజా సంఘాల నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేసారు. ఇది తెలంగాణ సాంస్కృతిక వారసత్వంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత తన మాటలతో స్ఫూర్తి నింపినందుకు సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, నాయకులు కిశోరె మున్నాగాల, దన్నంనేని సంపత్ కృష్ణ, సుమన్ బలమూరి తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z