* ఏపీ గుత్తేదారుల సంఘం ప్రతినిధులు ఆవేదన
ఒక ప్రాంతం గుత్తేదారులకు మాత్రమే బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వమే జీవో విడుదల చేయడం దారుణమని, తమ జీవితంలో ఇలాంటి జీవోను ఎప్పుడూ చూడలేదని ఏపీ గుత్తేదారుల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల, డోన్లో వాళ్లు మాత్రమే గుత్తేదారులా? తాము కాదా? అని ప్రశ్నించారు. తాము చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని అనేక సంవత్సరాలుగా అడుగుతున్నా పట్టించుకోకుండా.. పులివెందుల, డోన్లో గుత్తేదారులకు మాత్రమే బిల్లులు ఇవ్వడం ముఖ్యమంత్రి పక్షపాతం చూపినట్లు కాదా? అని ప్రశ్నించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి అందరినీ సమానంగా చూడాలని, ఇలా పక్షపాతంగా పాలన చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మిగిలిన గుత్తేదారులకు బిల్లులు చెల్లించాలని, లేని పక్షంలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
* కోమటిరెడ్డి బ్రదర్స్కు కేటీఆర్ చురకలు
బక్క పల్చని వ్యక్తి కేసీఆర్ను ఓడించేందుకు ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక నుంచి దిగుతున్నారనీ కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ను ఎదుర్కొనేందుకు తెలంగాణలో లీడర్లు లేరా అని ప్రశ్నించారు. సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తదనీ ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్లగొండ జిల్లా చిట్యాల లో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్డు షో లో బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొన్నారు.జనంలో లేని భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ నేతలు సంక్రాంతి గంగిరెద్దుల మాదిరిగా వస్తున్నారనీ విమర్శించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే ముఖ్యమంత్రి ఎవరో తెలియదనీ, సీల్డ్ కవర్ సీఎం తెలంగాణకు అవసరం లేదని ధ్వజమెత్తారు. తాజా మాజీ మంత్రి కేటీఆర్. రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ అసలే అక్కర లేదనీ చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు.. అంటే అరు నెలకు ఒక సీఎం గ్యారంటీ అని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్కు కర్నాటక నుంచి డబ్బులు వస్తున్నాయన్నారు కేటీఆర్. కోమటిరెడ్డి బ్రదర్స్కు ఈసారి గర్వభంగం తప్పదన్నారు. డబ్బు మదంతో కోమటిరెడ్డి బ్రదర్స్ మాట్లాడుతున్నారని, నకిరేకల్లో చిరుమర్తి లింగయ్య గెలవడం ఖాయమన్నారు.అటు కోమటిరెడ్డి బ్రదర్స్కు మంత్రి కేటీఆర్ చురకలు అంటించారు. డబ్బు సంచులతో మిడిసి పడుతున్నారనీ, డబ్బు మద్యం ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలో మూడు గంటల కరెంటు చాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటుండని అన్నారు. కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలా ఆలోచించుకుని ఓటు వేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు టీవీ వేదికల్లో కొట్టుకుంటున్నారని, మూడో సారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమై పోయిందన్నారు. మరోసారి కేసీఆర్ గెలిస్తే పేద ప్రజలకు మంచి జరుగుతుందని కేటీఆర్ చెప్పారు.
* రేపే ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు
రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్రం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) డబ్బులు బుధవారం బ్యాంకు ఖాతాల్లో జమకానున్నాయి. 15వ విడత కింద అర్హులైన దాదాపు 8కోట్లమందికి పైగా రైతుల ఖాతాల్లో రూ.2వేలు చొప్పున జమ చేయనున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఝార్ఖండ్లోని ఖుంటిలో బుధవారం ఉదయం 11.30గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులు విడుదల చేస్తారని పేర్కొంది. ఎవరైతే ఈ-కేవైసీ (eKYC) పూర్తి చేస్తారో వారి ఖాతాల్లో నిధులు జమ అవుతాయి.దేశవ్యాప్తంగా రైతులకు లబ్ధి జరిగేలా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరిట పథకాన్ని అమలు చేస్తోంది. ఏడాదిలో మూడు దఫాలుగా రూ.6వేలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంటుంది. ఒక్కో విడతలో అర్హులైన రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు చొప్పున జమ చేస్తున్నారు. కేంద్రం ఇప్పటిదాకా ఈ పథకం కింద 14 విడతలుగా నిధులను విడుదల చేసింది. తాజాగా బుధవారం (నవంబర్ 15న) 15వ విడత నిధులు విడుదల చేయనుంది. ఈ-కేవైసీ చేయించుకున్న వారిని లబ్దిదారులుగా గుర్తించి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు.
* ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే వస్తువుల నాణ్యత సరిగా లేదు
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే వస్తువుల నాణ్యత సరిగా లేదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడారు.గత ఏడాది రూ.1,050 కోట్లతో విద్యార్థులకు బ్యాగులు, షూస్ కొనుగోలు చేశారు. 42 లక్షల మంది పేద విద్యార్థుల కోసం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారు. ఈ పథకం కింద మూడేళ్లలో సామగ్రికి రూ.2400 కోట్లు ఖర్చు చేశారు. టెండర్ ప్రక్రియలో ఐదు కంపెనీలు సిండికేట్గా ఏర్పడ్డాయి. నిధులు దారి మళ్లినట్లు ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేలింది. విద్యార్థుల సామగ్రి కొనుగోలులో భారీ కుంభకోణం జరిగింది’’ అని నాదెండ్ల ఆరోపించారు.
* ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని లోకేశ్ డిమాండ్
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఈనెల 27లోపు బకాయిలు చెల్లించాలని లేని పక్షంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామన్న ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ లేఖపై లోకేశ్ స్పందించారు. బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దని లోకేశ్ మితవు పలికారు. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పటల్స్కు రూ.1000కోట్లు బకాయిలు పెట్టడంతో సేవలు నిలిపివేస్తామని అసోషియేషన్ ప్రభుత్వానికి లేఖ రాయడం బాధాకరమన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో వైఎస్ఆర్ కడపలో ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు అందించబడవని బోర్డులు పెట్టినప్పుడే జగన్ రెడ్డి పనితనమేమిటో అందరికీ అర్థమైపోయిందన్నారు. చేతగానిపాలనతో ఖజానాను దివాలా తీయించిన సీఎం వైఎస్ జగన్ ముఖం చూసి కాంట్రాక్టర్లు పరారు కావడం చూశామని లోకేశ్ చెప్పుకొచ్చారు. స్కూలు పిల్లలకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ నిర్వహించడానికి పేపర్లకు దిక్కులేక వాట్సాప్లో ప్రశ్నాపత్రాలను పంపించిన విచిత్రమైన పరిస్థితిని కూడా చూసినట్లు లోకేశ్ చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వ అస్తవ్యవస్థ ఆర్థిక విధానాలతో ట్రిపుల్ ఎ ప్లస్గా ఉన్న రాష్ట్ర పరపతిని ట్రిపుల్ బి ప్లస్కు దిగజార్చారని నారా లోకేశ్ ఆరోపించారు. తాజాగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు కేటాయించకపోవడం అంటే పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనని చెప్పుకొచ్చారు. సీఎం వైఎస్ జగన్ ఇప్పటికైనా బకాయిలు చెల్లించి.. ప్రైవేట్ ఆస్పత్రులలో పేదలకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు.
* జగన్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడే చేస్తా
ఆంధ్రప్రదేశ్లో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చేసింది.. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నా.. అప్పుడే.. నేతలు ఎక్కడ నుంచి పోటీ చేయాలి.. ఏ స్థానం నుంచి బరిలోకి దిగితే బెటర్.. ఆ నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటే మంచిదా? అనే విషయాలపై నేతలు ఫోకస్ పెట్టారు. అయితే, ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. తన పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు.. వచ్చే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే సీఎం జగన్ టికెట్లు కేటాయిస్తారన్న ఆయన.. ప్రజలకు చేసిన కార్యక్రమాలు చూసి మరోసారి ఆశీర్వదించాలని సీఎం జగన్ ప్రజలను కోరుతున్నారు అన్నారు.ఇక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక, సాధికార బస్సు యాత్రకు వస్తున్న విశేష స్పందన చూస్తే విపక్షాలకు మైండ్ బ్లాక్ అవుతుందన్నారు వైవీ సుబ్బారెడ్డి. మా కార్యక్రమాలను చూసి.. వాళ్లు మేనిఫెస్టోలు తయారు చేసుకుంటున్నారు అంటూ విపక్షాలపై సెటైర్లు వేశారు. మా పథకాలను చూసి మాకు ప్రజలు పట్టం కడతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక ఉచితమంటూనే దోచుకున్నారని ఆరోపణలు గుప్పించారు. గతం కన్నా ఇప్పుడు ఇసుక మెరుగ్గా దొరుకుతుందని తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ఏ మేరకు అవసరం ఉంటుందో ఆ మేరకు ఇసుక సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి.
* ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం(Delhi Pollution) మళ్లీ తారా స్థాయికి చేరింది. గాలిలో ఇవాళ కాలుష్య తీవ్రత అధికంగా ఉంది. వాయు నాణ్యత క్షీణించినట్లు అధికారులు వెల్లడించారు. అనేక ప్రాంతాల్లో కాలుష్యం కమ్మేసింది. ఇవాళ ఉదయం నగరం అంతా పొగ చూరుకున్నట్లు మారింది. దీపావళి పటాకుల వల్ల వాయు నాణ్యత పడిపోయింది.ఇవాళ ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 363గా రికార్డు అయ్యింది. వాయు నాణ్యత చాలా బ్యాడ్గా ఉన్నట్లు వెదర్ డేటా ద్వారా తెలుస్తోంది. 40 మానిటరింగ్ స్టేషన్లలో కేవలం 9 మాత్రమే డేటాను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది.రెండు రోజుల క్రితం ఆకస్మిక వర్షం వల్ల కాలుష్యం తగ్గినా.. దీపావళి పటాకులతో మళ్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరిగిపోయింది. సోమవారం రోజున ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కాలుష్యం ఉన్న నగరం ఢిల్లీగా రికార్డు అయినట్లు స్విస్ కంపెనీ ఐక్యూఎయిర్ పేర్కొన్నది. ఆ తర్వాత స్థానాల్లో పాక్లోని లాహోర్, కరాచీ ఉన్నాయి. ముంబై, కోల్కతాలు అయిదవ, ఆరవ స్థానాల్లో ఉన్నాయి.
* ఐటీ దాడులు కాంగ్రెస్ నేతలకు కొత్త కాదన్నారు:రేణుకా చౌదరి
తెలంగాణలో కాంగ్రెస్ సునామీ వీస్తోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మంలో పువ్వాడ ఓడిపోతున్నాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. భయంతో కార్పొరేటర్లపై దాడులు, బైండోవర్ కేసులు పెడుతున్నారన్నారు. అధికార మదంతో చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే నీ ఇంటికి వచ్చి నిలదీస్తా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోయిన తక్షణం.. వలస పోతావు పువ్వాడ అంటూ ఆమె మాట్లాడారు.నాగు పాముకు పాలు పోసి పెంచినా కాటు వేస్తుందని.. అలాగే పువ్వాడకి ఎంత చేసినా పాము లాగానే వ్యవహరిస్తారని విమర్శలు గుప్పించారు. బీజేపీ, బీఆర్ఎస్ మిలాకత్ అయ్యాయని ఆమె ఆరోపించారు. ఐటీ దాడులు కాంగ్రెస్ నేతలకు కొత్త కాదన్నారు కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి. ఐటీ వాళ్ళు పిచ్చి వెదవలు అంటూ రేణుక.. ఇళ్లల్లో డబ్బులు పెట్టుకుని ఉంటామా అంటూ వ్యాఖ్యానించారు. పోలీసు కార్లలో డబ్బులు వెళ్తున్నాయని ఆమె ఆరోపణలు చేశారు. కాంగ్రెస్లో కోవర్టులు ఉన్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీలలో మా కోవర్టులు ఉన్నారన్నారు. కాంగ్రెస్ పవర్లోకి వస్తే.. బీఆర్ఎస్ వాళ్ళ పవర్ కట్ అవుతోంది కదా అంటూ మాట్లాడారు. కేసీఆర్ నిజమే చెప్తున్నారని రేణుక చౌదరి అన్నారు.
* క్షమాపణలు చెప్పిన మస్క్
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ (Piyush Goyal)కు ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) క్షమాపణలు (apologises) చెప్పారు. కేంద్ర మంత్రి ప్రస్తుతం కాలిఫోర్నియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విద్యుత్ కార్ల తయారీ టెస్లా ప్లాంట్ (Tesla factory) ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్లాంట్లోని విద్యుత్ కార్ల తయారీని పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కేంద్ర మంత్రి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.కాలిఫోర్నియాలోని ఫ్రెమోంట్ (Fremont, California)లో గల అత్యాధునిక టెస్లా విద్యుత్ కార్ల తయారీ కేంద్రాన్ని సందర్శించాను. ఇక్కడ ప్రతిభావంతులైన భారతీయ ఇంజినీర్లు, ఫైనాన్స్ నిపుణులు సీనియర్ స్థానాల్లో పనిచేస్తున్నారు. వారిని చూడటం ఆనందాన్ని కలిగించింది. టెస్లా అద్భుత ప్రయాణంలో వారు అందిస్తున్న సహకారం చూసి చాలా ఆనందంగా ఉంది’ అని రాసుకొచ్చారు. అయితే, ఈ పర్యటనలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ను మిస్ అవుతున్నట్లు చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.