తెలంగాణ ఆర్టీసీపై మహిళల ఉచిత ప్రయాణ ప్రభావం పడింది. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిలళకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభమైన రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ప్రయాణీకులు పెరిగారు. ఈ క్రమంలో పలు రూట్లలో చాలినంత బస్ సర్వీసులు లేక ప్రయాణికుల అనేక ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల నుంచి బస్సులు సరిపోవడం లేదని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి.
దీంతో స్పందించిన టీఎస్ఆర్టీసీ.. అర్జెంటుగా అద్దె బస్సులు కావాలని ఓ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్న వారు బస్సులను అద్దెకు ఇవ్వొచ్చని సూచించింది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ సబర్బన్, సిటీ మఫిసిల్ బస్సులు కావాలని ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. అసక్తి ఉన్న వారు http://tsrtc.telangana.gov. లేదా మొబైల్ నంబర్: 9100998230ను సంప్రదించాలని కోరింది. గ్రేటర్ హైదరాబాద్లో నడిపేందుకు అద్దె బస్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానించిన టీఎస్ఆర్టీసీ బస్సు నమూనా, కలర్, సీట్లు, తదితర అంశాలతో అద్దె బస్సుల యజమానులు దరఖాస్తు చేసుకోవాలని సూచనలు జారీ చేసింది.
కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మీ పథకం కింద డిసెంబర్ 9వ తేదీన మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. మహాలక్ష్మి-ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన లభించిందని.. 11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసినట్లు ఆర్టీసి ఎండీ సజ్జనార్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక పలు రూట్లలో బస్సులు సరిపోకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి.
👉 – Please join our whatsapp channel here –