Politics

షర్మిల ఎంపీ కావడమే లక్ష్యం-NewsRoundup-Apr 05 2024

షర్మిల ఎంపీ కావడమే లక్ష్యం-NewsRoundup-Apr 05 2024

* దిల్లీ మద్యం విధానం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు అనుమతి కోరుతూ దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో సీబీఐ పిటిషన్‌ దాఖలు చేయగా.. అందుకు న్యాయస్థానం సమ్మతించింది. ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా కవిత తిహాడ్‌ జైలులో ఉన్నందున ఆమెను ప్రశ్నించే ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది.

* రాష్ట్రంలో పింఛనుదారుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. జగన్‌ (YS Jagan) తక్షణమే సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. తండ్రి చనిపోతే రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారని.. బాబాయ్‌ను చంపేసి మళ్లీ దండేసి సానుభూతి పొందారని వ్యాఖ్యానించారు. వైకాపా నేతలు శవరాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు.

* ఉక్రెయిన్‌ (Ukraine) ఇంటెలిజెన్స్‌ సంస్థ ఎస్‌బీయూ, సైన్యం సంయుక్తంగా భారీ స్థాయిలో రష్యాపై దాడి చేశాయి. దక్షిణ రోస్టవ్‌లోని మోరోజోవ్స్క్‌ వైమానిక స్థావరంపై నిన్న రాత్రి జరిగిన ఈ దాడిలో ఆరు విమానాలు పూర్తిగా ధ్వంసం కాగా.. మరో ఎనిమిది వరకు తీవ్రంగా దెబ్బతిన్నాయని బారెన్స్‌ వార్తా సంస్థ పేర్కొంది. డజన్ల సంఖ్యలో డ్రోన్లను ఉపయోగించినట్లు తెలుస్తోంది.

* సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha Elections) పోలింగ్‌ శాతాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే గత లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్‌ నమోదైన 266 స్థానాలను గుర్తించింది. తెలంగాణ సహా ఆయా రాష్ట్రాల్లోనూ జాతీయ సగటు (67.40) కంటే తక్కువ పోలింగ్‌ నమోదైంది. దీంతో ఈసారి అక్కడ ఓట్ల శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఈసీ ముందడుగు వేస్తోంది.

* లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) తర్వాతే విపక్షాల కూటమి ‘ఇండియా’ తరఫున ప్రధానమంత్రి ఎవరనే దానిపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. ప్రస్తుతం తాము సైద్ధాంతికంగా పోరాడుతున్నామన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేవారు, వాటిని రక్షించే శక్తుల మధ్యే తాజా పోరు అని వెల్లడించారు.

* భారీ భూకంపం తైవాన్‌ను (Taiwan earthquake) కుదిపేసింది. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. 1,011 మంది గాయపడ్డారు. ప్రకంపనల తీవ్రతకు ఆ ద్వీపం వ్యాప్తంగా దాదాపు 770 భవనాలు దెబ్బతిన్నాయి. భారీ వంతెనలు కొన్ని సెకన్లపాటు అటూ, ఇటూ ఊగాయి. రోడ్లపై వాహనాలు కుదుపులకు లోనైన పలు వీడియోలు బయటకొచ్చాయి.

* నితేశ్‌ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో బాలీవుడ్‌ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ ప్రతిష్ఠాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ‘రామాయణ’గా ఇది రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. తాజాగా ఈ భారీ ప్రాజెక్ట్‌ మ్యూజికల్‌ విశేషాలు సందడి చేస్తున్నాయి. సినిమాకు ఎంతో ముఖ్యమైన సంగీతం కోసం చిత్రబృందం ఆస్కార్‌ విజేతలను సెలెక్ట్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. తన సంగీతంతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే ఏఆర్‌ రెహమాన్‌తో పాటు హాలీవుడ్‌ ఫేమస్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ హన్స్‌ జిమ్మెర్‌ దీనికి ట్యూన్స్‌ అందించనున్నారట. హన్స్‌ జిమ్మెర్‌ హాలీవుడ్‌లోని టాప్‌ సినిమాలకు సంగీతం అందించారు. ఆయనకు ఈ కథ గురించి వివరించగానే వెంటనే అంగీకరించారని.. దీని పనులు మొదలుపెట్టేందుకు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని సమాచారం. ఇందులోని పాటలు ఎప్పటికీ గుర్తుండిపోవాలనే మూవీ యూనిట్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని కూడా కొన్ని ఫొటోలు సందడి చేశాయి. దీనికోసం భారీ సెట్‌ వేశారంటూ ప్రచారం జరుగుతోంది.

* ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో అందరి నోటా ఎక్కువగా వినిపిస్తున్న పేరు మయాంక్‌ యాదవ్ (Mayank Yadav). ఈ ఎడిషన్‌లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన పేసర్‌గా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ లఖ్‌నవూ బౌలర్‌ను ఎదుర్కోడానికి స్టార్‌ క్రికెటర్లే ఇబ్బందిపడ్డారు. వేగంతోపాటు కచ్చితమైన లెంగ్త్‌తో బంతిని వేయడం అద్భుతమని సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. దీంతో ఈ కుర్రాడిని వచ్చే టీ20 ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్లు సూచించారు. అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకొనే యాక్షన్‌తో బౌలింగ్‌ వేస్తున్నాడని.. షమీ, బుమ్రా తర్వాత మూడో పేసర్‌గా మయాంక్‌ను తీసుకోవాలని మనోజ్‌ తివారీ పేర్కొన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తంచేశాడు.

* మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఆప్‌ అధినేత, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను ఈడీ అరెస్టు చేసినప్పటికీ.. ఆయన తిహాడ్ జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. ఆయన రాజీనామా చేయాల్సివస్తే తర్వాత సీఎం ఎవరనే దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. తాజాగా దిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సునీతా కేజ్రీవాల్‌ (Sunita Kejriwal) తనను తాను దిల్లీ సీఎం మెసేంజర్‌గా చెప్తుంటారని సౌరభ్‌ మీడియాతో అన్నారు. ‘‘కేజ్రీవాల్ పంపే సందేశాలను ఆమె వినిపిస్తున్నారు. అదంతా పార్టీ కార్యకర్తలు, మా మద్దతుదారులపై గొప్ప సానుకూల ప్రభావం చూపుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని ఐక్యంగా ఉంచేందుకు ఆమె బెస్ట్‌ పర్సన్‌’’ అని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పార్టీ తరఫున ప్రచారం చేస్తారా? అని అడగ్గా..‘‘అదే జరిగితే మేం చాలా సంతోషిస్తాం. పాల్గొనాలా..? వద్దా..? అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయం’’ అని పేర్కొన్నారు.

* వైఎస్‌ షర్మిలను ఎంపీ చేయాలని తన తండ్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ఎంతగానో తాపత్రయపడ్డారని ఆయన కుమార్తె సునీత అన్నారు. రాజకీయాల కోసమే తన తండ్రిని క్రూరంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య చేయించిన వాళ్లే మళ్లీ ఎంపీ బరిలో ఉన్నారని మండిపడ్డారు. కడపలో తన తండ్రిని చంపిన వాళ్లకు, షర్మిలకు మధ్య పోటీ జరుగుతోందన్నారు. శుక్రవారం వైఎస్సార్‌ జిల్లా కాశినాయన మండలం వరికుంట్లలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన బస్సు యాత్రలో సునీత మాట్లాడుతూ.. ‘వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఉంటే దీన్ని సహించేవారా? పదవుల కోసం తమ్ముణ్ని చంపితే చూసి తట్టుకొనేవారా? కడప ఎంపీగా షర్మిలను దీవించి అవినాశ్‌ రెడ్డిని ఓడించాలని’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.

* జగనన్న వదిలిన బాణం వైకాపానే పొడుస్తోందని సినీనటుడు, జనసేన నేత పృథ్వీ అన్నారు. జగన్‌ వదిలిన బాణం పోటు దెబ్బ 12శాతం ఓట్లపై ప్రభావం చూపుతుందన్నారు. ఉండవల్లిలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో ఆయన సమావేశమయ్యారు. తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ.. ఈ నెల 18నుంచి ప్రచార కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ ఎన్నికల్లో వైకాపా ఓటమి ఖాయమన్నారు. 2019లో వైకాపా విజయానికి తాడేపల్లిలో టపాసులు కాల్చానని గుర్తు చేసుకున్న ఆయన.. ఈసారి వైకాపా ఓటమికి మళ్లీ అక్కడే టపాసులు కాల్చుతానని చెప్పారు. సీఎం జగన్‌కు ప్రజలతో పాటు ప్రకృతి కూడా జవాబిస్తుందన్నారు.

* ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను ఎవరైనా తమకే నేరుగా అందించవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. సీఈవో కార్యాలయంలో ప్రతిరోజూ సాయంత్రం 4-5 గంటల మధ్య ఫిర్యాదులు, వినతులు స్వీకరిస్తామన్నారు. రాజకీయ పార్టీలు, వ్యక్తులు, సంస్థలు ఎవరైనా నేరుగా ఫిర్యాదు చేయొచ్చన్నారు. సెలవు రోజుల్లోనూ సీఈవో కార్యాయలం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

* ట్రోల్స్‌ గురించి ఆలోచించకూడదని నిర్మాత దిల్‌ రాజు (Dilraju) అన్నారు. పరుశురామ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’ విడుదల సందర్భంగా ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో మాట్లాడుతూ ట్రోల్స్‌పై తనదైనశైలిలో స్పందించారు. ‘‘నాకు గతంలో అసలు మీమ్స్‌ గురించి అవగాహన లేదు. నా పెళ్లి తర్వాత ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాను. అందులో నా భార్యను ఎలా కలిశాను.. మా జర్నీ ఎలా మొదలైందో చెప్పాను. ఆ వీడియోపై ట్రోల్స్‌ చేశారు. అవి నా భార్య చూపించింది. నేను వాటి గురించి పట్టించుకోను. తెలుగు రాష్ట్రాల్లో నన్ను గుర్తుపట్టేవారు కోటి మంది ఉంటారు. నాపై కామెంట్స్‌ చేసేవాళ్లు పదివేల మంది ఉంటారంతే. ఇలా ట్రోల్స్‌, నెగెటివ్ కామెంట్స్‌ చేసేవాళ్ల గురించి పట్టించుకుంటే నేను మిగతా వాళ్లకు దూరమవుతాను. అందుకే నేను అలాంటి వాళ్ల గురించి ఎక్కువగా ఆలోచించను. నెగిటివిటీని మన దగ్గరకు రాకుండా జాగ్రత్తపడాలి. అయినా అవ్వన్నీ వస్తూపోతూ ఉండే మేఘాల్లాంటివి. వాటికి భయపడితే ఎలా? నేను ఆకాశం లాంటివాడిని. అవేమైనా చంపేస్తాయా.. చంపలేవు కదా! అలాంటి మేఘాలన్నీ వెళ్లిపోయాక మనకు ఆకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది’ అన్నారు. ఇక ‘ఫ్యామిలీ స్టార్‌’ తనకెంతో ప్రత్యేకమని దిల్ రాజు చెప్పారు. 21ఏళ్ల క్రితం ఇదే రోజున ‘దిల్‌’ సినిమా విడుదలై తనకు మంచి గుర్తింపు తెచ్చిందన్నారు. మళ్లీ ఇన్నేళ్లకు అదే తేదీలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రావడం ఆనందంగా ఉందన్నారు.

* ఐదు సార్లు ఛాంపియన్‌ అయిన ముంబయి జట్టు.. ఈ సీజన్‌(IPL)లో తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. కెప్టెన్సీ మార్పే ఇందుకు కారణమని పలువురు విమర్శిస్తున్నారు. రోహిత్‌ శర్మ(Rohit Sharma)ను కాదని.. హర్దిక్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించడంపై పలువురు బహిరంగంగానే మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు శ్రీశాంత్‌ రోహిత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌.. హార్దిక్‌ కెప్టెన్సీలో ఆడేందుకు ఇష్టపడతాడని శ్రీశాంత్‌ పేర్కొన్నాడు. ‘క్రికెట్‌ దిగ్గజమైన సచిన్‌.. ధోనీ కెప్టెన్సీలో ఆడలేదా..?ఆ సమయంలో ప్రపంచకప్‌ కూడా గెలిచాం కదా. ఇప్పుడు హార్దిక్‌ కెప్టెన్సీలో రోహిత్‌ ఆడటంపై ఎన్నో కథనాలు వస్తున్నాయి. కానీ, హిట్‌మ్యాన్‌ స్వేచ్ఛగా ఆడటాన్నే ఇష్టపడతాడు. సారథ్య బాధ్యతలు లేకపోవడంతో గొప్పగా బ్యాటింగ్‌ చేస్తాడు. ఆరెంజ్‌ క్యాప్‌ రేసులోనూ నిలుస్తాడు. ఇది అతడికి మంచి సీజన్‌ అవుతుంది. గతంలో అతడు ముంబయిని ముందుండి నడిపించాడు. ఇప్పుడు జట్టును వెనకనుంచి నడిపించబోతున్నాడని నేను నమ్ముతున్నాను’ అని శ్రీశాంత్‌ విశ్లేషించాడు.

* ఉక్రెయిన్‌ (Ukraine) ఇంటెలిజెన్స్‌ సంస్థ ఎస్‌బీయూ, సైన్యం సంయుక్తంగా భారీ స్థాయిలో రష్యాపై దాడి చేశాయి. దక్షిణ రోస్టవ్‌లోని మోరోజోవ్స్క్‌ వైమానిక స్థావరంపై నిన్న రాత్రి జరిగిన ఈ దాడిలో ఆరు విమానాలు పూర్తిగా ధ్వంసం కాగా.. మరో ఎనిమిది వరకు తీవ్రంగా దెబ్బతిన్నాయని బారెన్స్‌ వార్తా సంస్థ పేర్కొంది. డజన్ల సంఖ్యలో డ్రోన్లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. తాము 44 డ్రోన్లను కూల్చివేశామని రష్యా రక్షణశాఖ పేర్కొంది. ఓ పవర్‌ సబ్‌స్టేషన్‌ కూడా ఈ దాడిలో దెబ్బతిన్నట్లు సమాచారం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z