తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. ఉత్తర్ప్రదేశ్లోని బరేలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. బరాదరి పోలీస్స్టేషన్ పరిధిలో నివసించే ఓ మహిళ తన కుమార్తెపై అత్యాచారం జరిగిందంటూ 2019 డిసెంబరు 2న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన 15ఏళ్ల కూతురిని అజయ్ అలియాస్ రాఘవ్ దిల్లీకి తీసుకెళ్లాడని, మత్తు పదార్థాలు ఇచ్చి అత్యాచారం చేశాడని అందులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను న్యాయస్థానంలో హాజరుపరిచారు. అజయ్ తనపై అత్యాచారం చేశాడంటూ బాలిక తొలుత వాంగ్మూలం ఇచ్చింది. దీంతో ఈ కేసు అప్పటి నుంచి పెండింగ్లో ఉండగా నిందితుడు నాలుగేళ్లుగా జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత కోర్టులో విచారణ సందర్భంగా.. బాలిక అసలు విషయాన్ని వెల్లడించింది. తన వాంగ్మూలం తప్పని న్యాయమూర్తి ఎదుట అంగీకరించింది. దీంతో అదనపు సెషన్స్ న్యాయస్థానం అజయ్ను నిర్దోషిగా ప్రకటించింది. తప్పుడు కేసు పెట్టినందుకు బాలిక తల్లిపై 340 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో పాటు ఓ వ్యక్తి 1,653 రోజులు జైలులో గడిపేలా చేసినందుకు ఆమెపై చర్యలకు ఉపక్రమించింది. మహిళను కూడా జైలులో అన్ని రోజులపాటు ఉంచాలని జడ్జి జ్ఞానేంద్ర త్రిపాఠి ఆదేశించారు. రూ.5,88,822 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల జైలుశిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z