Devotional

బ్రహ్మోత్సవాల సందర్భంగా తితిదే కీలక నిర్ణయాలు

బ్రహ్మోత్సవాల సందర్భంగా తితిదే కీలక నిర్ణయాలు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఒకే రోజు స్వామివారితో పాటు వాహన సేవల దర్శన భాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేశామని తితిదే ఈవో శ్యామలరావు తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలతోపాటు వీఐపీ సిఫార్సులపై బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసినట్లు వెల్లడించారు. స్వయంగా వచ్చే వీఐపీలకే దర్శన అవకాశం ఉంటుందని వివరించారు. గరుడ సేవ జరిగే 8వ తేదీన దాన్నీ రద్దు చేశామని తెలిపారు. దర్శనాలలో సామాన్యులకే ప్రాధాన్యమివ్వనున్నట్లు పునరుద్ఘాటించారు.

‘బ్రహ్మోత్సవాల రోజుల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనాల కోసం 1.32 లక్షల టికెట్లను ఆన్‌లైన్‌లో ఇచ్చాం. ఈ వ్యవధిలో సర్వదర్శనానికి వచ్చే వారికి తిరుపతిలో రోజుకు 24 వేల టోకెన్లు ఇవ్వనున్నాం. దీని వల్ల రోజుకు సుమారు 80 వేలు, గరుడ సేవనాడు లక్ష మంది దర్శనానికి వీలుంటుంది. ఉదయం ఎనిమిదింటి నుంచి పది గంటల వరకు, సాయంత్రం ఏడింటి నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు జరిగే వాహన సేవలను తిలకించేందుకు ఏర్పాట్లు చేశాం. గరుడ సేవ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 11 వరకు జరుగుతుంది. ఈ వేడుకను రెండు లక్షల మంది ప్రత్యక్షంగా వీక్షించేలా గ్యాలరీలను, వారికి అన్నప్రసాద వితరణ తదితర ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ రోజు కొండపైకి 3.5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. తిరుమలలో మొత్తంగా 6,200 గదులు అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్‌ కోటా తగ్గించి కరెంటు బుకింగ్‌ ద్వారానే అందిస్తాం. వీఐపీల కోసం 1300 గదులున్నాయి. మొత్తంగా 40 వేల మందికి వసతి కల్పిస్తాం. తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, ఇతర వసతి గృహాలూ అందుబాటులో ఉంటాయి.

తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలోనే కాకుండా కొండపై పలు ప్రాంతాల్లో అన్నప్రసాద కేంద్రాలు అందుబాటులో ఉంచుతాం. గరుడ సేవనాడు ఉదయం ఏడింటినుంచి రాత్రి ఒంటిగంట వరకు వెంగమాంబ అన్నదాన సత్రం అందుబాటులో ఉంటుంది. సాధారణ రోజుల్లో 3.5 లక్షల లడ్డూలను ఇస్తున్నాం. ఉత్సవాల నేపథ్యంలో మరో ఏడు లక్షల నిల్వలు అందుబాటులో ఉంచుతాం. ప్రసాదాల పంపిణీకి మరో 11 కౌంటర్లు ఏర్పాటుచేస్తున్నాం. భద్రత దృష్ట్యా 12 ఏళ్లలోపు పిల్లలకు గుర్తించేందుకు వారికి ట్యాగ్‌ వేస్తున్నాం. తిరుపతిలో ఐదు ప్రాంతాల్లో పార్కింగ్‌ కేంద్రాల వద్ద ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచనున్నాం. ఆర్టీసీ బస్సులు రోజూ 2వేల ట్రిప్పులు, గరుడసేవ నాడు 3వేల ట్రిప్పులు నడుస్తాయి. గరుడ సేవనాడు కనుమ దారుల్లో ద్విచక్రవాహనాల రాకపోకలను నిలిపేస్తాం. గతేడాది 12 రాష్ట్రాలనుంచి సాంస్కృతిక బృందాలు వస్తే ఈసారి 21 రాష్ట్రాలనుంచి 60 బృందాలు రానున్నాయి..’ అని ఈవో తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z