Politics

నాగార్జునపై వ్యాఖ్యలు…కోర్టుకు హాజరైన కొండా సురేఖ-NewsRoundup-Feb 13 2025

నాగార్జునపై వ్యాఖ్యలు…కోర్టుకు హాజరైన కొండా సురేఖ-NewsRoundup-Feb 13 2025

* ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam)తో ఈ ఏడాది తెలుగులో విజయాన్ని అందుకున్నారు నటి ఐశ్వర్యా రాజేశ్‌ (Aishwarya Rajesh). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన సినీ కెరీర్‌, వ్యక్తిగత జీవితానికి గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. తన తల్లి (నటి నాగమణి) నుంచే తాను ఎంతో స్ఫూర్తి పొందానని ఆమె చెప్పారు. స్వతహాగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. వచ్చిన అవకాశాల్లో నచ్చిన సినిమాలు చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చినందుకు తాను ఎంతో గర్వంగా ఉన్నానని అన్నారు.

* ‘బ్రహ్మా ఆనందం’ (Brahma Anandam) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) చేసిన వ్యాఖ్యలపై పలువురు విమర్శలు కురిపిస్తోన్న విషయం తెలిసిందే. చిరంజీవిపై విమర్శలు వేస్తోన్న వేళ ఆయన మంచి మనసు గురించి తెలియజేస్తూ ‘బేబీ’ (Baby Movie) నిర్మాత ఎస్‌.కె.ఎన్‌ (SKN) తాజాగా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. కొంతమంది కావాలని ఇలాంటి విమర్శలు చేస్తుంటారని ఆరోపించారు. ‘‘పెళ్లిళ్లు చేసి అత్తారింటికి సాగనంపిన చెల్లెళ్లకి సైతం తన స్వార్జిత ఆస్తులు పంచిన వ్యక్తిత్వం ఆయనది. నిజమైన ఫ్యామిలీ మ్యాన్‌. ఎవరినీ ఏమీ అనని మనిషి కదా ఆయనపై ఊరికే అవాకులు చెవాకులు పేలడం, అనవసరంగా రాద్ధాంతం చేయటం తద్వారా పిచ్చి ఆనందం పొందటం కొందరికి అలవాటు’’ అని విమర్శించారు.

* ఇటీవల విడుదలైన జేఈఈ (మెయిన్‌) తొలి విడత పరీక్ష ఫలితాల్లో విఫలమైనందుకు ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తక్కువ స్కోరు వచ్చిందన్న నిరాశతో 18 ఏళ్ల విద్యార్థిని హాస్టల్‌లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. కన్నవారి కలల్ని నెరవేర్చలేకపోయినందుకు క్షమించాలంటూ రాసిన లేఖను పోలీసులు గుర్తించారు. ఈ విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో చోటుచేసుకుంది. సంత్‌ కబీర్‌ నగర్‌ జిల్లాకు చెందిన బాలిక.. గోరఖ్‌పుర్‌లోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ అక్కడే కోచింగ్ తీసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

* రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తూనే ఐటీ ఉద్యోగులు ల్యాప్‌టాప్‌లో వర్క్‌ చేస్తూ ఉండటం మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. అలా బెంగళూరు (Bangalore)కు చెందిన ఓ మహిళ కూడా ప్రయాణవేళల్లో వర్క్‌ చేసింది. అయితే ఆ సమయంలో ఆమె కారు నడుపుతూ ల్యాప్‌టాప్‌లో వర్క్‌ చేయడం వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కాగా.. దీనిపై పోలీసులు చర్యలు చేపట్టారు. బెంగళూరులోని ఆర్టీ నగర్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ కారు డ్రైవ్‌ చేస్తూనే ల్యాప్‌టాప్‌లో వర్క్‌ చేస్తుంది. దీన్ని ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారి ట్రాఫిక్‌ పోలీసుల కంట పడింది. దీంతో ఆమెను ట్రాక్ చేసిన పోలీసులు వెయ్యి రూపాయిలు జరిమానా విధించారు. అంతేకాక.. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆ మహిళ వీడియోతో పాటు అదుపులోకి తీసుకున్న ఫొటోను ట్రాఫిక్ డీసీపీ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (work from home) అనేది ఇంటి నుంచి చేసేది. కారు డ్రైవ్‌ చేస్తూ కాదు’ అని రాసుకొచ్చారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. పోలీసుల చర్యకు అభినందనలు తెలుపుతున్నారు. మరోవైపు ఆ మహిళ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

* రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (RCPL) యాజమాన్యంలోని సాఫ్ట్‌ డ్రింక్‌ బ్రాండ్‌ కాంపా కోలా (Campa Cola) తన బ్రాండ్‌ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నిర్ణయించింది. తద్వారా ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న కోకాకోలా వంటి అంతర్జాతీయ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా బ్రాండ్‌కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు గానూ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (IPL) 2025 కో-ప్రెజెంటర్‌ హక్కుల్ని దక్కించుకుంది. ఇందుకోసం రూ.200 కోట్లు వెచ్చించనుంది. గత ఐపీఎల్‌ సీజన్‌లో ఈ కో- ప్రెజెంటింగ్‌ హక్కుల్ని కోకాకోలాకు చెందిన థమ్స్‌ అప్‌ రూ.200 కోట్లకు దక్కించుకుంది. ఇదే మొత్తానికి కాంపా కోలా ఈ ఏడాది కో-ప్రెజంటర్‌గా వ్యవహరించనుంది.

* ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు 10వ తేదీ వరకు 20 నామినేషన్లు వచ్చాయని, అందులో పది మంది మాత్రమే అర్హత సాధించారని విశాఖ జిల్లా కలెక్టర్‌, రిటర్నింగ్‌ అధికారి ఎం.ఎన్‌.హరింద్ర ప్రసాద్‌ తెలిపారు. ఎవరూ నామినేషన్లు ఉపసంహరించుకోకపోవడంతో మొత్తం పది మంది బరిలో ఉన్నట్లు చెప్పారు.

* సినీ నటుడు అక్కినేని నాగార్జున, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ వేర్వేరుగా దాఖ‌లు చేసిన‌ పరువు నష్టం క్రిమినల్‌ కేసుల్లో ఎట్టకేలకు మంత్రి కొండా సురేఖ గురువారం కోర్టుకు హాజరయ్యారు. ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి శ్రీదేవి ఇటీవల జారీ చేసిన ఆదేశాల మేరకు రెండు కేసుల్లోనూ ఆమె ముద్దాయి కావడంతో తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలనే నింబంధనలను పాటిస్తూ కోర్టుకు హాజరయ్యారు.

* నీరు మనకు ప్రాణాధారం. ఆరోగ్య పరిరక్షణలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. జీవక్రియలకు ఎంతో అవసరం. మన ఆరోగ్యం బాగుండాలంటే తగినంత నీరు తాగాల్సిందే. అయితే, రోజు మొత్తంలో ఎంత నీరు తాగాలనే విషయంలో చాలామంది మదిలో ప్రశ్నలు మెదులుతుంటాయి. తక్కువ నీరు తాగడం అనారోగ్యానికి దారితీసినట్లే.. ఓవర్‌ హైడ్రేషన్‌ కూడా సమస్యాత్మకమే. ఈ నేపథ్యంలో నీరు తాగడం మోతాదులోనే ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. అమెరికాకు చెందిన ‘నేషనల్‌ అకాడమిక్స్‌’ సంస్థ ప్రకారం.. పురుషులకు రోజుకు సగటున 3.7 లీటర్లు, మహిళలకు 2.7 లీటర్ల నీరు అవసరం. ఆహారం, ఇతర పానీయాల నుంచి అందే నీటిశాతం ఇందులో భాగమే. అయితే, ఈ లెక్కలు అన్నివేళలా, అందరికీ ఒకేలా వర్తించాలనేది లేదు. కొన్ని అంశాలు ఇందులో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి.

* కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విద్యార్థినులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డం లేద‌ని అమ్మాయిలు మండిప‌డుతున్నారు. కాంగ్రెస్ 420 హామీల‌పై విద్యార్థినులు ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తున్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి 14 నెల‌లు గ‌డిచిన‌ప్ప‌టికీ.. ఏ ఒక్క హామీ అమ‌లు కాలేదంటూ.. ఎంపీ ప్రియాంక గాంధీకి విద్యార్థినులు వినూత్నంగా లేఖ‌లు రాశారు. ఈ కార్య‌క్ర‌మం తెలంగాణ వ్యాప్తంగా కొన‌సాగుతోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z