Sports

భారత ఎంపైర్లకు కష్టకాలం

BCCI Must Focus On Making Good Umpires From India

సమీప భవిష్యత్తులో భారతదేశం నుంచి ప్రపంచ స్థాయి అంపైర్‌ ఒక్కరైనా వస్తారని అనుకోవడం లేదని మాజీ అంపైర్‌ సైమన్‌ టాఫెల్‌ అన్నారు. ఐసీసీ అంపైర్ల ఎలైట్‌ ప్యానెల్‌లోకి ఒక భారతీయుడు ప్రవేశించాలంటే కనీసం పదేళ్ల సమయం పడుతుందని పేర్కొన్నారు. 2015లో ఈ ప్యానెల్‌లో అడుగుపెట్టిన ఎస్‌ రవిని ఈ ఏడాది మొదట్లో తొలగించారు. ఆయన యాషెస్‌ సహా 33 టెస్టులు, 48 వన్డేలు, 18 టీ20లకు అంపైరింగ్‌ చేశారు. ‘ప్రపంచ స్థాయి అంపైర్‌ కావాలంటే కనీసం పదేళ్లు పడుతుంది. మేం భారతదేశంలో ఈ కార్యక్రమాన్ని 2006లో మొదలుపెట్టి 2016లో ముగించినట్టు గుర్తుంది. ఎలైట్‌ ప్యానెల్లోకి ఎస్‌ రవి అడుగుపెట్టేందుకు కనీసం పదేళ్లు పట్టింది. అందుకే బీసీసీఐ ఈ విషయంపై పునరాలోచించాలి. ఉద్దేశపూర్వకంగా ఏదైనా తప్పు జరుగుతోందని అనుకోను. కానీ భారత్‌కు అంపైర్లు అవసరం. దేశవాళీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తానంటున్న గంగూలీ దీనిపైనా దృష్టిసారించాలి. అంపైర్లు ఎదిగే వాతావరణాన్ని సృష్టించాలి. అంపైర్స్‌ మేనేజర్‌, అంపైర్స్‌ కోచ్‌, అంపైర్స్‌ ట్రైనర్స్‌ను ప్రత్యేకంగా కేటాయించాలి. అందరూ సురక్షితంగా ఉండే, ప్రతిభకు పట్టం కట్టే వ్యవస్థను సృష్టించాలి’ అని టాఫెల్‌ అన్నారు.