భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వానికి భారీ జరిమానా చెల్లించేందుకు అంగీకరించింది. అమెరికా వీసా నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ ఎనిమిది లక్షల డాలర్ల (సుమారు రూ.56 కోట్లు) మేర జరిమానా విధించినట్టు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ జేవియర్ బెకెరా ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇన్ఫోసిస్ సంస్థ ఔట్సోర్సింగ్ సర్వీసుల్ని నిర్వర్తించడంలో భాగంగా వీసా నిబంధనల్ని అతిక్రమిస్తోందంటూ అమెరికాలో గతంలో ఫిర్యాదులు నమోదయ్యాయి. సంస్థపై అమెరికాలో అనేక పరిమితులు ఉండడంతో 2006-2017 మధ్య భారత్ నుంచి తన ఉద్యోగుల్ని బిజినెస్ వీసాలతో కాలిఫోర్నియాకు తీసుకొచ్చిందని ఫిర్యాదులో ఆరోపించారు. ఔట్సోర్సింగ్ సర్వీసుల కోసం ఇన్ఫోసిస్ తన ఉద్యోగులను హెచ్-1బీ వీసాలకు బదులుగా బిజినెస్ వీసాలు బీ-1 కింద తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. తద్వారా వివిధ రకాల పన్నులు ఎగ్గొట్టిన్నట్లు తెలిపారు. సంస్థలో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి ఇచ్చిన సమాచారం మేరకు దీనిపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో కాలిఫోర్నియా ప్రభుత్వంతో నవంబరులోనే ఇన్ఫోసిస్ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ, వాటి వివరాలు మంగళవారమే బయటకు వచ్చాయి. 2017లోనూ ఇదే తరహా ఆరోపణల కింద న్యూయార్క్ ప్రభుత్వానికి ఒక మిలియన్ డాలర్లు చెల్లించేందుకు ఇన్ఫోసిస్ అంగీకరించింది.
Infosys Fined 800K For Abusing Visas & Fraud
Related tags :