Sports

సారీ…సుశీల్

Wrestler Susheel Kumars Plea Denied

రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌కు భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) షాక్‌ ఇచ్చింది. గాయంతో బాధ పడుతున్న సుశీల్‌ తన 74 కేజీల ఫ్రీ స్టైల్‌ విభాగంలో నిర్వహించే ట్రయల్స్‌ను వాయిదా వేయాలని డబ్ల్యూఎఫ్‌ఐని కోరాడు. అయితే ట్రయల్స్‌ను వాయిదా వేయడం ఎట్టిపరిస్థితుల్లో కుదరదని డబ్ల్యూఎఫ్‌ఐ తేల్చిచెప్పింది. ట్రయల్స్‌లోని విజేతలు ఈ నెలలో రోమ్‌ వేదికగా జరగనున్న ఫస్ట్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌ టోర్నీకి, ఫిబ్రవరిలో దిల్లీ వేదికగా జరగనున్న ఆసియా ఛాంపియన్‌షిప్‌కు, మార్చిలో చైనాలో జరగనున్న ఆసియా ఒలింపిక్స్‌ క్వాలిఫయిర్‌కు అర్హత సాధిస్తారు. ‘‘ట్రయల్స్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ వాయిదా వేయలేం. 74 కేజీల విభాగంలో పోటీ పడటానికి ఎంతో మంది క్రీడాకారులు సిద్ధంగా ఉన్నారు. సుశీల్‌ గాయపడితే మేం ఏం చేయగలం. ట్రయల్స్‌లో నిలిచిన విజేత ఫస్ట్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో పరిశీలిస్తాం. ఆ తర్వాత నిర్ణయాన్ని తీసుకుంటాం’’ అని డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు భూషణ్‌ శరణ్‌ తెలిపారు. అయితే సుశీల్‌ కంటే మెరుగైన రెజ్లర్‌ లేరని డబ్ల్యూఎఫ్‌ఐ భావిస్తే అతడికి ఆసియా క్వాలిఫయిర్‌కు అవకాశం ఇస్తామని డబ్ల్యూఎఫ్‌ఐ సహాయ కార్యదర్శి వినోద్‌ తోమర్‌ అన్నారు. డబ్లూఎఫ్‌ఐ వ్యాఖ్యలపై సుశీల్‌ కుమార్‌ స్పందించాడు. రెండు వారాల్లో ఫిట్‌నెస్‌ సాధించి పునరాగమనం చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ‘‘రెండు వారాల్లో పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి తిరిగి బరిలోకి దిగుతా. దీనిపై దిగులు చెందాల్సిన పనిలేదు. సాధనలో నా చేతికి గాయమైంది. నేను గాయంతో బాధపడుతున్న విషయం డబ్ల్యూఎఫ్‌ఐకి తెలుసు. ఒక వేళ వారు ట్రయల్స్‌ను కొనసాగించాలనుకుంటే కొనసాగించుకోవచ్చు’’ అని సుశీల్‌ అన్నాడు. ఈ దిగ్గజ రెజ్లర్‌ రెండు ఒలింపిక్స్‌ (2008 బీజింగ్‌-కాంస్యం, 2012 లండన్‌-రజతం) పతకాలు గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.