Movies

అదే పిసుకుడు ప్రసంగం

Bandla Ganesh Speech At Sarileru Neekevvaru

‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత తనని ఎవరూ బ్లేడ్‌ గణేశ్‌ అని పిలవద్దని బండ్ల గణేశ్‌ అని పిలవాలని నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ ప్రేక్షకులను కోరారు. ఆదివారం ‘సరిలేరు నీకెవ్వరు’ మెగా సూపర్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ సందర్భంగా బండ్ల గణేశ్‌ మాట్లాడారు. ‘‘ప్రపంచంలోనే ఎవరైనా నేను, నా కొడుకు, నా వాళ్లు బాగుండాలని కోరుకోవడం న్యాయం, ధర్మం. కానీ, వాటన్నింటికీ అతీతుడు మెగస్టార్‌ చిరంజీవి. ఒక మెగస్టార్‌ మరో సూపర్‌స్టార్‌ కోసం వచ్చిన ఆయన సంస్కారానికి పాదాభివందనాలు. మీరు వందేళ్లు చల్లగా ఉండాలి. మీరు మహేశ్‌బాబు పక్కనే ఉంటే మరో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తీయొచ్చేమో. మీరు అన్నదమ్ములుగా నటించాలని కోరుకుంటున్నా. అసలు మెగాస్టార్‌ మళ్లీ నటించాలని బలమైన కోరిక కోరుకున్న వాళ్లలో నేనూ ఒకడిని. అందుకు ఎందరో దేవుళ్లకు మొక్కుకున్నా. నన్ను మర్చిపోయి అన్ని సినిమాలు వాళ్ల అబ్బాయికే చేస్తున్నారు. ఈ సినిమా మహేశ్‌ కెరీర్‌లో నెం.1 సినిమా అవుతుంది. అనిల్‌ రావిపూడి దీన్ని రూ.250కోట్లు కొల్లగొట్టేలా తీశాడు. ఈ సినిమా తర్వాత నన్ను దయ చేసి బ్లేడ్‌ గణేశ్‌ అని ఎవరూ అనవద్దు.. బండ్ల గణేశ్‌ అనే పిలవండి. ఏదో తెలిసో తెలియకో నోరు జారా. ఇక నుంచి బండ్ల గణేశ్‌గానే మీ ముందు ఉండాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు. మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు. రష్మిక కథానాయిక. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.