DailyDose

నన్ను 139మంది రేప్ చేశారు-నేరవార్తలు

నన్ను 139మంది రేప్ చేశారు-నేరవార్తలు

* హైద‌రాబాద్‌లో ఓ కేసు సంచ‌ల‌నంగా మారింది.. పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్‌లో ఏకంగా 139 మందిపై రేప్ కేసు పెట్టింది ఓ యువ‌తి… 113 పేజీలతో సుదీర్ఘ ఫిర్యాదు లేఖ‌ను రాసిన ఆ యువ‌తి.. అందులో రాజకీయ నాయకుల పీఏలు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల పేర్లను కూడా చేర్చిన‌ట్టు తెలుస్తోంది. మొత్తంగా తనపై 139 మంది అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్టు పంజాగుట్ట పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది మిర్యాల‌గూడ‌కు చెందిన 25 ఏళ్ల యువ‌తి.. దీంతో.. 139 మంది నిర్భ‌య కేసు న‌మోదు చేశారు పోలీసులు.. గతంలో ఆ యువ‌తికి ప‌రిచ‌యం ఉన్న అంద‌రిపై ఫిర్యాదు చేసిన‌ట్టుగా చెబుతున్నారు.. ఇక‌, కేసు నమోదు చేసి పంజాగుట్ట పోలీసులు.. ద‌ర్యాప్తు చేప‌ట్టారు. త‌న‌పై 139 మంది అత్యాచారానికి పాల్ప‌డ్డారంటూ ఆ యువ‌తి ఫిర్యాదు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

* తెలంగాణ పరిధిలోని శ్రీశైలం ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్‌ సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు.. దారితీసిన పరిస్థితులను వెలికితీయాలని సీఎం స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు సీఐడీ అదనపు డీజీ గోవింద్‌సింగ్‌ను విచారణాధికారిగా నియమిస్తూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఆదేశించారు.శ్రీశైలం విద్యుదుత్పత్తి కేంద్రం అగ్నిప్రమాదంలో ప్రాణనష్టంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

* హైదరాబాద్‌లో మరోసారి సంచలనం సృష్టించిన డ్రగ్స్ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో డ్రగ్స్ మూలాలు బయటపడుతున్నాయి. అధికారుల కంట పడకుండా డ్రగ్స్ మాఫియా డ్రగ్స్‌ని భూమిలో పాతి పెడుతున్నట్లు తెలిసింది. మేకా ల్యాబ్‌లో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని విచారించగా కొత్త విషయాలు బయటికి వచ్చాయి. ఎవరి కంట పడకుండా ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న భూమిలో 45 కిలోల ఎపిడ్రిన్, 7.5కిలోల మేపిడ్రిన్ డ్రగ్‌ని పాతిపెట్టారు నిందితులు. ఈ క్రమంలో డీఆర్ఐ అధికారులు భూమిలో పాతిపెట్టిన 6 కోట్ల డ్రగ్స్‌ని వెలికి తీశారు. ఇక మరోవైపు ఇప్పటివరకు 100కోట్ల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ అధికారులు, దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మేక ల్యాబ్‌తో పాటు డ్రగ్స్ తయారీ ఎక్కడెక్కడ జరుగుతుందనే దానిపై వారు దృష్టి సారించారు

* ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ లక్ష్మణ్‌పై సస్పెన్షన్ వేటు పడింది.సివిల్ కేసులు, పంచాయితీలు చేస్తున్నారనే ఆరోపణలపై సీఐ లక్ష్మణ్‌పై జిల్లా ఎస్పీ సిద్ధార్ట్ కౌశల్ విచారణకు ఆదేశించారు.ఆరోపణలపై ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ విచారణ చేపట్టారు.విచారణ నివేదికతో పాటు ఎస్పీ సిఫారసు మేరకు సీఐ లక్ష్మణ్‌ను సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు ఉత్తర్వులు జారీ చేశారు.పామూరు సీఐగా పనిచేస్తున్న శివరామకృష్ణారెడ్డిని ఒంగోలు తాలూకా సీఐగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.