Devotional

శబరిమల వెళ్లాలంటే ఈ నియమాలు తప్పనిసరి

శబరిమల వెళ్లాలంటే ఈ నియమాలు తప్పనిసరి

కేరళలో కొన్నాళ్లపాటు తగ్గిన కరోనా ఉద్ధృతి తాజాగా మరోసారి పెరుగుతోంది. దేశంలోనే తొలిసారి ఇక్కడ వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలను కట్టుదిట్టం చేయడంతో కేసులు గణనీయంగా తగ్గాయి. అయితే తాజాగా గడిచిన కొన్ని రోజుల నుంచి భారీ సంఖ్యలో కేసులు నమోదవ్వడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. మరోవైపు ప్రఖ్యాత శబరిమల యాత్ర కూడా దగ్గర పడుతుండటంతో అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు యాత్రకు రానున్న నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో స్థానిక భాషల్లో ప్రచురిస్తూ అందరికీ తెలియజేయాలని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్‌ మెహతా కోరారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
**మార్గదర్శకాలివే..!
* భక్తులు ముందుగానే కేరళ పోలీస్‌శాఖ అభివృద్ధి చేసిన వర్చువల్‌ క్యూ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. దీని కోసం https://sabarimalaonline.org వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
* వారం ప్రారంభంలో రోజుకు 1000 మంది, వారాంతాల్లో రోజుకు 2000 మంది చొప్పున పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకునే వీలు కల్పించారు. పరిస్థితులను మార్పులు చేస్తారు.
* దర్శనానికి 48 గంటల ముందు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. అందులో నెగటివ్‌ వచ్చిన వారినే అనుమతిస్తారు. ప్రవేశమార్గంలోనూ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహిస్తారు.
* పది సంవత్సరాలలోపు వారికి, 60-65 సంవత్సరాలు దాటిన వారిని దర్శనానికి అనుమతించరు. దీర్ఘకాలిక, గుండె సమస్యలతో బాధపడుతున్న వారు కూడా శబరిమల యాత్రకు రాకూడదు.
* శబరిమల యాత్రకు వచ్చిన వాళ్లు తమతో ఆయుష్మాన్‌ భారత్‌, బీపీఎల్‌ తదితర ఆరోగ్యబీమా కార్డులను వెంటతెచ్చుకోవాల్సి ఉంటుంది.
* స్వామికి నెయ్యి అభిషేకాలు, పంపా నదిలో స్నానాలు, సన్నిధానంలో రాత్రి బసచేయడం వంటివాటిని అనుమతించరు.
* కేవలం ఎరుమేలి, వడసెర్రికర మార్గాల్లో మాత్రమే భక్తులను అనుమతిస్తారు. మిగతా అన్ని రూట్లను తాత్కాలికంగా మూసివేయనున్నారు.