WorldWonders

ఆంగ్లంలో డబుల్ గ్రాడ్యూయేట్…గంగా నది తీరంలో భిక్షాటన!

ఆమె ఓ విద్యాకుసుమం. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలిగే ఆమె ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో యాచకురాలిగా జీవనం సాగిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని కుమావూ విశ్వవిద్యాలయంలో రెండు సార్లు అంగ్లంలో పట్టభద్రురాలైన హన్సీ ప్రహారి అక్కడే విద్యార్థి నాయకురాలిగా ఎదిగారు. అక్కడి గ్రంథాయంలో ఉద్యోగం చేస్తుండేవారు. వైవాహిక జీవితంలో తలెత్తిన వివాదాల కారణంగా తీవ్ర విషాదంలో మునిగిపోయిన హన్సీ ప్రస్తుతం హరిద్వార్‌లోని రైల్వే స్టేషన్, బస్టాండు, గంగా తీరంలోని ఘాట్‌లలో భిక్షమెత్తుకుంటున్నారు. ఆమె గతంలో.. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ అజయ్‌ టమ్‌టాకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఆమెకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కుమారుడు ఆమెతోనే వీధుల వెంటే జీవిస్తున్నాడు. ఆమెకు తెలిసిన విద్యను కుమారుడికి నేర్పిస్తున్నారు. తనను ఆదుకోవాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. తాను మామూలు స్థితికి వస్తే తన కుమారుడిని బాగా చదివించాలనుకుంటున్నట్లు ఆమె తెలిపారు.