Sports

ఇండియా చాలా ఒత్తిడిలో ఉంటుంది

Ponting Predictions On Indian Tour Of Australia

తొలి టెస్టు తర్వాత కెప్టెన్‌ కోహ్లి జట్టును వీడడం భారత ఆటగాళ్లపై ఒత్తిడిని పెంచుతుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. ‘‘బ్యాట్స్‌మన్‌గా, నాయకుడిగా భారత్‌కు కోహ్లి ఎంతో కీలకం. అతడు లేని లోటు ఆ జట్టుకు తెలుస్తుంది’’ అని చెప్పాడు. ‘‘కోహ్లి గైర్హాజరీలో రహానె జట్టు పగ్గాలు అందుకునే అవకాశముంది. అది అతడిపై అదనపు ఒత్తిడికి కారణమవుతుంది. చాలా ముఖ్యమైన నాలుగో స్థానంలో మరో బ్యాట్స్‌మన్‌ బ్యాటింగ్‌ చేయాల్సివుంటుంది. తొలి టెస్టుకు బ్యాటింగ్‌ లైనప్‌ ఎలా ఉండాలనే విషయంలో భారత్‌కు ఇప్పటికీ స్పష్టత ఉందని నేను అనుకోను. ఇక కోహ్లి వెళ్లిపోయాక ఎవరు ఇన్నింగ్స్‌ ఆరంభిస్తారు? ఎవరు నాలుగో స్థానంలో ఆడారు?’’ అని పాంటింగ్‌ అన్నాడు. ‘‘షమి, బుమ్రాలకు తోడుగా ఇషాంత్‌, ఉమేశ్‌, సిరాజ్‌లలో పేస్‌ బౌలింగ్‌ భారాన్ని పంచుకునే దెవరు? గులాబీ బంతి టెస్టుకు ఏ స్పిన్నర్‌ను తీసుకోవాలి? ఇలా చాలా ప్రశ్నలకు భారత్‌.. సమాధానాలు వెతుక్కోవాల్సివుంది’’ అని చెప్పాడు. 2018-19లో ఆస్ట్రేలియాపై భారత్‌ టెస్టు సిరీస్‌ విజయం గురించి ప్రస్తావించగా.. ‘‘నిజమే టీమ్‌ఇండియా గత పర్యటనలో ఉత్తమంగా ఆడింది. అయితే ఆతిథ్య జట్టు టాప్‌ ఆర్డర్‌లో స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ లేరన్న సంగతి మరువకూడదు. అలాంటి నాణ్యమైన ఆటగాళ్ల సేవలు కోల్పోవడం ఏ జట్టుకైనా పూడ్చుకోలేని లోటే’’ అని పాంటింగ్‌ స్పందించాడు.