WorldWonders

మద్యం కోసం పెళ్లికొడుకుని హత్య చేసిన మిత్రులు

మద్యం కోసం పెళ్లికొడుకుని హత్య చేసిన మిత్రులు

పెళ్లికి స్నేహితులను పిలిచిన ఓ వరుడు వారికి మందు, విందు ఏర్పాటు చేశాడు. వివాహ తంతు ముగిసిన తర్వాత మిత్రులతో సరదాగా గడిపేందుకు వెళ్లి వారి చేతుల్లోనే దారుణ హత్యకు గురయ్యాడు. అడిగినంత మద్యం ఏర్పాటు చేయలేదని నవ వరుడిని పొడిచి చంపారు అతడి స్నేహితులు. ఈ దిగ్భ్రాంతికర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….అలీగఢ్‌లోని పాలీముకీంపూర్‌ గ్రామానికి చెందిన 28ఏళ్ల బబ్లూకు గత సోమవారం అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహమైంది. పెళ్లికొచ్చిన తన స్నేహితులకు ఆ వరుడు ప్రత్యేకంగా విందు ఏర్పాటుచేశాడు. వివాహతంతు ముగిసిన తర్వాత బబ్లూ మిత్రులను కలిసేందుకు వెళ్లాడు. అప్పటికే బాగా మద్యం మత్తులో ఉన్న అతడి స్నేహితులు మరింత మద్యం కావాలని అడిగారు. అయితే ఇప్పటికే చాలా తాగేశారని, ఇంకా మద్యం తీసుకురాలేనని వరుడు చెప్పాడు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మిత్రుల్లో ఒకడు బబ్లూను పొడిచాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.