Politics

పవన్ కళ్యాణ్‌కు పీసీసీ ఛీఫ్ పదవి ఇప్పిస్తా

పవన్ కళ్యాణ్‌కు పీసీసీ ఛీఫ్ పదవి ఇప్పిస్తా

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆఫర్ ఇచ్చారు. ఆయన కాంగ్రెస్‌లోకి వస్తే పీసీసీ చీఫ్‌ పదవి ఇప్పిస్తానని ప్రకటించారు. దొండపాడులో వంగవీటి రంగా విగ్రహాన్ని వీహెచ్‌ ఆవిష్కరించారు. వంగవీటి రంగా రానున్న రోజుల్లో సీఎం అవుతాడనే హత్య చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో 3 శాతం ఉన్న సామాజికవర్గం వారు కాంగ్రెస్‌ను నాశనం చేశారని దుయ్యబట్టారు. బీసీలకు పీసీసీ చీఫ్‌ ఇవ్వాలన్నందుకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, బెదిరింపులకు భయపడనని స్పష్టం చేశారు. పార్టీ కోసం ప్రాణం పోయినా ఫరవాలేదన్నారు. దళితుడిని సీఎం చేస్తానని సీఎం కేసీఆర్‌ మోసం చేశారని వీహెచ్‌ చెప్పారు. ఏపీలో 27 శాతం ఉన్న కాపులు రాజ్యాధికారం సాధించాలని ఆకాంక్షించారు. వంగవీటి రంగా తర్వాత పవన్‌కల్యాణ్‌కు మంచి వేవ్ ఉందని హనుమంతరావు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ పదవి కోసం నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆ పార్టీ అధిష్టానం ఇప్పటికే టీపీసీసీ చీఫ్ ఎవరు అనే దానిపై ఓ లిస్టును కూడా రెడీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లిస్ట్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఇద్దరి నేతలను వెనక్కి నెట్టి అనూహ్యంగా రేవంత్‌రెడ్డి పేరు ముందుకు వచ్చింది. రేవంత్‌రెడ్డే తెలంగాణ కాంగ్రెస్ సారధి అని సోషల్ మీడియాతో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రేవంత్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వనున్నారన్న నేపథ్యంలో ఆయనపై, రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడిపై, సహచర నేతలపై వీహెచ్ మండిపడ్డారు. రేవంత్‌కు పీసీసీ ఇస్తే కాంగ్రెస్‌ను వీడేందుకు కూడా తాను సిద్ధమని స్పష్టం చేశారు. టీడీపీని నిండా ముంచిన రేవంత్‌రెడ్డి.. పీసీసీ పదవి చేపడితే కాంగ్రెస్‌ పార్టీనీ బొందపెడతాడని విమర్శించారు. హనుమంతరావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారో లేదో.. ఇంతలోనే ఆయనకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడితే చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. వీహెచ్‌ను గుర్తుతెలియని వ్యక్తి అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో సైబరాబాద్‌ పోలీసులకు వీహెచ్ ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన కోరారు.