Politics

అఖిలమ్మ…నీ ఫోన్ ఏదమ్మా?

అఖిలమ్మ…నీ ఫోన్ ఏదమ్మా?

ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అపహరణ సమయంలో కిడ్నాపర్లతో ఆమె తరచూ మాట్లాడినట్లు పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. ఆమె చరవాణితో పాటు.. అపహరణ సందర్భంగా మాట్లాడేందుకు తాత్కాలికంగా మరో సెల్‌ఫోన్‌ ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడ నుంచి కూకట్‌పల్లిలోని లోధ అపార్ట్‌మెంట్ వరకు ఆమె రెండు చరవాణిల్లో మాట్లాడుకుంటూ వచ్చినట్లు పోలీసులు తేల్చారు.

పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో అఖిలప్రియ ఉపయోగించిన రెండు చరవాణిలు ఆమె ఇంట్లోనే ఉండిపోయాయి. వాటిని స్వాధీనం చేసుకొని విశ్లేషిస్తే మరిన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అఖిలప్రియ ఇళ్లకు తాళం వేసి ఉంది. ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి ఇంటి తాళం తీసి సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు అపహరణ కేసులో జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవ్ రామ్ తల్లి కిరణ్మయి, సోదరుడు చంద్రహాస్‌ను నిందితులుగా చేర్చిన పోలీసులు వాళ్ల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. అపహరణ కుట్ర గురించి వీళ్లకు ముందే తెలుసునని.. వీళ్ల సమక్షంలో కిడ్నాపర్లతో చర్చించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు పరారీలో ఉన్న భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను కోసం పోలీసు బృందాలు గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం 12మంది నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.