మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నిన్న వెల్లడించిన తెలంగాణ ఎన్నికల సర్వేపై తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. లగడపాటి సర్వే సైతం మహాకూటమి విజయం తథ్యమని చెప్పిందన్నారు. ఇక తెరాస పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. రెండున్నర నెలల క్రితం లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వే ప్రకారం తెరాసకు 90 సీట్లు వస్తాయంటే ఆనందపడిన కేసీఆర్.. ఇప్పుడు తెరాస ఓడిపోతుందని చెబితే ఆయనపై విమర్శలకు దిగుతున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని చంద్ర గార్డెన్స్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రజాకూటమి బలపరిచిన తెదేపా అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్యకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తెరాసను చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.