Politics

రేవంత్ జ్యోతిష్యం

రేవంత్ జ్యోతిష్యం

మల్కాజ్‌గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు వస్తే దేశం రెండుగా విడిపోవడం ఖాయమని, ఆ తర్వాత దేశ విభజన ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని జోస్యం చెప్పారు. నగరంలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అధ్యక్షడు కావడానికి దక్షిణ భారత్ ఓట్లు అవసరం లేదని, అధ్యక్షుడికి నేరుగా ఎన్నికలు జరిగితే .. దక్షిణ భారత ప్రజలు సున్నాగా మారుతారన్నారు. దేశ విభజన జరిగితే దక్షిణాది దేశం అత్యంత ధనిక దేశం అవుతుందన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజల అవసరం లేకుండా అధ్యక్షుడి ఎన్నిక జరిగినప్పుడు.. ఇక్కడి ప్రజలు ఎందుకు ఊరుకుంటారని ప్రశ్నించారు. మోదీ ప్రధాని అయ్యాక దక్షిణ రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిందని, ప్రాధాన్యం కలిగిన కేంద్ర మంత్రి పదవులను ఉత్తరాది వారికే కట్టబెడుతున్నారని ఆరోపించారు. ట్యాక్స్ అత్యధికంగా కడుతుంది దక్షిణ భారత్ రాష్ట్రాల వారేనని, కానీ నిధులు ఉత్తరాది రాష్ట్రాలకు వెళుతున్నాయన్నారు. దక్షిణాది రాష్ట్రాల వివక్షకు కారణమయ్యే జమిలి ఎన్నికల ఆలోచనను మోదీ విరమించుకోవాలని, లేకుంటే ఈ అన్ని అంశాలను పార్లమెంట్‌లోనే మాట్లాడుతానన్నారు. రైతు ఉద్యమాన్ని అణచివేసేందుకు జాతీయ రహదారులను కిలోమీటర్ల మేర తవ్వడం దుర్మార్గమన్నారు. దీనిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. రాజ్యాంగాన్ని సవరణలు చేసినప్పుడు.. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేస్తే తప్పేముందన్నారు. వ్యవసాయ చట్టాలపై ప్రధాని మోదీపై ఎవరి ఒత్తిడి ఉందన్నారు. ఇక బడ్జెట్ గురించి మాట్లాడుతూ.. అబద్దాలు చెప్పడం లో మోదీ,కేసీఆర్ ఒకరిని మించిన వారు మరొకరన్నారు. కేంద్ర బడ్జెట్‌లో అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేయడం ఇప్పుడు కొత్తేమీ కాదన్నారు. గతంలో బీహార్‌కు ఐదు లక్షల కోట్ల ప్యాకేజీ అన్నారని.. అది ఏమైందన్నారు. ఎప్పటికప్పుడు అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టడం మోదీ, కేసీఆర్‌లకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.