Politics

చేవెళ్ల నుండి షర్మిల పాదయాత్ర!

చేవెళ్ల నుండి షర్మిల పాదయాత్ర!

వైఎస్ షర్మిల సొంత పార్టీ పెట్టనున్నారంటూ వస్తున్న ప్రచారం నిజమని తేలిపోయింది. మంగళవారం ఆమె పార్టీకి పునాది వేయనున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి లోటస్‌పాండ్‌లోని బ్రదర్‌ అనిల్‌ కార్యాలయంలో రేపు షర్మిల కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే తెలంగాణలో పార్టీని ప్రారంభిచేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. కలిసి వచ్చే నేతలు, సన్నిహితుల అభిప్రాయాలను ఆమె తీసుకున్నారని చెబుతున్నారు. రెండు రోజుల పాటు హైదరాబాద్ శివారులోని ఓ హోటల్‌లో ఆమె పార్టీ ఏర్పాటుపై సన్నిహితులతో సుదీర్ఘ మంతనాలు చేసినట్లు సమాచారం. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీ, వరంగల్‌కు చెందిన ఓ కీలక నేతతో పాటు పలువురు ప్రముఖులతో షర్మిల చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. పార్టీ నిర్మాణంపై 9వ తేదీని ఆమె ముందుగానే నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదే రోజు పార్టీని ప్రకటించే అవకాశం ఉందని షర్మిల సన్నిహితులు చెబుతున్నారు. ఒకవేళ వత్తిళ్ల కారణంగా పార్టీని ప్రకటించకపోయినా.. ఆమె రంగంలోకి దిగినట్లేనని చెబుతున్నారు. షర్మిల అన్నింటినీ సర్ధుబాటు చేసుకునే పార్టీ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రకటన తర్వాత ఆమె చేవెళ్ల నుంచి పాదయాత్ర చేసేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. షర్మిల పార్టీ గురించి ప్రకటించినప్పుడు చాలామంది రకరకాల కామెంట్లు చేశారు. సీఎం జగన్‌పై షర్మిల అసంతృప్తిగా ఉంటే పార్టీని తెలంగాణలో ఎందుకు పెడతారని, ఒకవేళ పెడితే ఏపీలో పెడతారని విశ్లేషించారు. కానీ షర్మిల రాజకీయ వ్యూహం మరోలా ఉందని ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. గతంలో షర్మిల పార్టీ గురించి చెప్పినప్పుడు ఆమె పేరుతో ఓ ఖండన వచ్చింది. అయితే ఆ ప్రకటనలో పార్టీ పెట్టబోవడం లేదనే ఖండన మాత్రం లేదు. చేవెళ్ల నియోజకవర్గానికి వైఎస్ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. చేవెళ్ల నుంచి 2003లో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించారు. ఉమ్మడి ఏపీలో ఆయన 1,467 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పాదయాత్రతో రాజశేఖర్‌రెడ్డికి జనాదరణ లభించడమే కాకుండా ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేయడం వల్ల ముఖ్యమంత్రి స్థానానికి ఎలాంటి పోటీ లేకుండా ఆయనే సీఎం కుర్చీలో కూర్చుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రభుత్వ కార్యక్రమాలు దాదాపుగా అక్కడి నుంచే ప్రారంభించడం గమనార్హం. అంతేకాదు చేవెళ్ల సెంటిమెంట్‌పై అనేక సార్లు రాజశేఖర్‌రెడ్డి ప్రకటనలు కూడా చేశారు. దక్షిణ తెలంగాణకు తాగు, సాగు నీరు అందించేందుకు చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టుకు నవంబర్ 19, 2008లో శంకుస్థాపన చేశారు. తిరిగి 2009లో ఎన్నికల ప్రచారాన్ని కూడా చేవెళ్ల నుంచే ప్రారంభించి రెండోసారి సీఎం కుర్చీలో రాజశేఖర్‌రెడ్డి కూర్చున్నారు. అంతేకాదు చేవెళ్ల నుంచి ఎలాంటి కార్యక్రమం చేపట్టినా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతులు మీదుగా ప్రారంభించేవారు. చేవెళ్ల చెల్లెమ్మగా సబితా ఇంద్రారెడ్డిని పిలుచేవారు. అంతేకాదు తన కేబినెట్‌లో రాజశేఖర్‌రెడ్డి ఆమెను హోంమంత్రిని చేశారు. అందుకే ఇప్పడు తండ్రి బాటలో తనయ షర్మిల తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించాలని భావిస్తోంది. తండ్రికి చేవెళ్ల సెంటిమెంట్ కలిసివచ్చినట్లే షర్మిలకు కలిసి వస్తుందో లేదో వేచిచూడాలి మరి.