Business

కర్నూలు చేరిన తొలి విమానం-వాణిజ్యం

Business News - First Flight Reaches Kurnool Airport

* కర్నూలు ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న తొలి విమానం. బెంగళూరు నుంచి కర్నూలుకు చేరుకున్న ప్యాసింజర్ విమానం.52 మంది ప్రయాణికులతో వచ్చిన 6 ఈ 7911ఇండిగో విమానం.ప్రయాణికులతో తిరుగు ప్రయాణమైన విమానం.

* భారీ ఎత్తున కంటెయినర్లతో వెళుతున్న ఎంవీ ఎవర్ గ్రీన్ నౌత, ఈజిప్ట్ సమీపంలోని సూయజ్ కెనాల్ లో చిక్కుకుని పోగా, దాదాపు 120 షిప్ లు ఎటూ కదల్లేక కాలువలో నిలిచిపోయాయి. మంగళవారం నాడు కెనాల్ లోని ఇసుక మేటల్లో నౌక అడ్డుగా చిక్కుని పోగా, ఎన్నో దేశాలకు చేరుకోవాల్సిన నౌకలు నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించిన హై రెజల్యూషన్ శాటిలైట్ చిత్రాలు విడుదల అయ్యాయి. దాదాపు 2,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ నౌకలు ముందుకు సాగేందుకు అనుమతి కోసం వేచి చూస్తున్నాయి.ఈ చిత్రాలను మాక్సర్ వరల్డ్ వ్యూ శాటిలైట్ చిత్రీకరించింది. ఈ కృత్రిమ వాణిజ్య నౌకా మార్గం ఎన్నో దేశాల అవసరాలను తీరుస్తున్నదన్న సంగతి తెలిసిందే. ఇసుక మేటల్లో చిక్కుకున్న నౌకను తొలగించేందుకు దాదాపు 5 రోజులుగా సాగుతున్న ప్రయత్నాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రాలను కలుపుతూ ఈ కెనాల్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.ఇప్పటివరకూ సుమారు 9.6 బిలియన్ డాలర్ల నష్టం సంభవించిందని, ఆసియా, యూరప్ దేశాల మధ్య వాణిజ్యానికి విఘాతం కలిగిందని అధికారులు అంటున్నారు. ఈ విషయమై సూయజ్ కెనాల్ అథారిటీ చీఫ్ ఒసామా రాబీ స్పందిస్తూ, ఈ ప్రమాదం కారణంగా తమకు రోజుకు 14 మిలియన్ డాలర్ల ఆదాయ నష్టం సంభవిస్తోందని, నౌకను పక్కకు తీసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. సాంకేతిక టీమ్ లు ఈ విషయమై నిర్విరామంగా కృషి చేస్తున్నాయని, అయితే, బలమైన గాలులు, వాతావరణ పరిస్థితులు కొంత అడ్డంకిగా మారినా, సాధ్యమైనంత త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని భావిస్తున్నామని తెలిపారు.

* దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల డొక్కు వాహనాలు ఉన్నట్లు లెక్క తేలింది. వీటిలో దాదాపు 70 లక్షల వాహనాలు ఒక్క కర్ణాటకలోనే ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ వివరాలను డిజిటలైజ్‌ చేసింది. అయితే, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్‌, లక్షద్వీప్‌ వివరాలు అందుబాటులో లేవు.

* ఈ ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్‌ ఇష్యూ(ఐపీఓ)కు వచ్చిన భారత కంపెనీలు బాగా రాణించాయి. ప్రపంచ మార్కెట్‌లో ద్రవ్యలభ్యత, దేశీయ షేర్‌ మార్కెట్ల దూకుడు అందుకు కలిసి వచ్చాయి. దీంతో ఈ ఏడాది ఐపీఓల ద్వారా పలు కంపెనీలు రూ.31,000 కోట్లు సమీకరించాయి. 2021-22లోనూ ఐపీఓల జోరు కొనసాగనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

* ఎలక్ట్రానిక్స్‌ వంటి ఫినిష్డ్‌ వస్తువుల కోసం చైనా నుంచి దిగుమతులపై భారత్‌ అధికంగా ఆధారపడి ఉందని అందరూ భావిస్తారు. చైనాకు ముడి ఇనుము ఎగుమతి చేయడంలో భారత్‌ ముందంజలో ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- ఫిబ్రవరిలో ఇంజినీరింగ్‌ ఉత్పత్తుల ఎగుమతులు ఏకంగా 114 శాతం వృద్ధి చెందాయని పరిశ్రమ సంఘం ఇంజినీరింగ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఈఈపీసీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అగ్రగామి 25 విపణులకు భారత ఇంజినీరింగ్‌ ఎగుమతుల వాటా దేశ మొత్తం ఇంజినీరింగ్‌ ఎగుమతుల్లో నాలుగింట మూడొంతుల పైగానే ఉన్నాయి. సంప్రదాయ మార్కెట్లపై భారత ఎగుమతిదార్లు ఆధారపడుతుండటాన్ని ఇది సూచిస్తోంది. భారత ఇంజినీరింగ్‌ ఉత్పత్తులకు చైనా, సింగపూర్, జర్మనీ, ధాయ్‌లాండ్, ఇటలీ దేశాల్లో మంచి గిరాకీ ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో చైనాకు ఎగుమతుల్లో సానుకూల వృద్ధి నమోదైంది. గతనెలలో చైనాకు పంపిన ఎగుమతులు 68 శాతం పెరిగి 235.58 మిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇక ఏప్రిల్‌ నుంచి ఫిబ్రవరి వరకు చూస్తే, 114 శాతం పెరిగి 4.28 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

* వచ్చే నెల నుంచి తమ అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ముడి చమురు ధరలు పెరగడంతో ఆ భారాన్ని కొంత మేర తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ‘ప్రస్తుత క్లిష్ట సమయంలో పెరిగిన వ్యయాల భారాన్ని చాలా వరకు భరించేందుకు ప్రయత్నించాం. స్వల్ప భారాన్ని మాత్రమే ధరల పెంపు రూపంలో వినియోగదారులకు బదిలీ చేస్తున్నామ’ని కంపెనీ పేర్కొంది.

* కరోనా కారణంగా రెస్టారెంట్ల వ్యాపారాలు కుదేలవుతున్నప్పటికీ.. అమెరికన్‌ ఫాస్ట్‌ఫుడ్‌ దిగ్గజం కెంటకీ ఫ్రైడ్‌ చికెన్ (కేఎఫ్‌సీ) మాత్రం భారత్‌లో తమ నెట్‌వర్క్‌ మరింత విస్తరించనున్నామని ప్రకటించింది. రానున్న కొన్నేళ్లలో భారత్‌లో ఈ బిజినెస్‌ వృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని కంపెనీకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.