ScienceAndTech

కోవిద్ జీవాయుధాలపై 2015లోనే చైనా చర్చ

కోవిద్ జీవాయుధాలపై 2015లోనే చైనా చర్చ

కరోనా వైరస్‌తో ఆయుధాలను తయారు చేయడంపై 2015లోనే చైనా శాస్త్రవేత్తలు చర్చించారా? సార్స్‌ కరోనా వైరస్‌లు నూతన శకం జీవాయుధాలా? ఇప్పటికే మనుషుల్లో వ్యాధికారక వైరస్‌లోకి దీనిని కృత్రిమంగా చొప్పించి ఆయుధాలుగా మలచుకోవచ్చా?.. అవుననే అంటోంది ‘ది ఆస్ట్రేలియన్‌’ కథనం. మూడో ప్రపంచ యుద్ధం జరిగితే అది జీవాయుధాలతోనే అని చైనా శాస్త్రవేత్తలు, ఆరోగ్య అధికారులు ఒక పత్రంలో రాసినట్లు పేర్కొంది. సార్స్‌ కరోనా వైరస్‌లను నూతన శకం జన్యు ఆయుధాలుగా డ్రాగన్‌ అభివర్ణిస్తోన్నట్లు తెలిపింది. జీవాయుధంతో దాడి చేస్తే శత్రుదేశం వైద్య వ్యవస్థ కుప్పకూలిపోతుందని చైనా సైన్యం పేర్కొంటోంది. కరోనా మహమ్మారి 2019లో విరుచుకుపడినప్పటికీ చైనా సైన్యానికి చెందిన శాస్త్రవేత్తలు ఇలాంటి వైరస్‌తో ఆయుధాల తయారీ గురించి ఐదేళ్ల క్రితం నుంచే చర్చిస్తూ వచ్చినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన పత్రాలు అమెరికా విదేశీ వ్యవహారాల శాఖకు లభ్యమైనట్లు మరికొన్ని ప్రసార మాధ్యమాలు వెల్లడించాయి. కొవిడ్‌-19పై స్వీయ దర్యాప్తులో భాగంగా అమెరికా అధికారులకు ఈ పత్రాలు చేజిక్కినట్లు తెలిపాయి. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) కమాండర్లు ఎలాంటి ఘాతుకాలకు పాల్పడతారో ఇవి రుజువు చేస్తున్నాయని యూకే నుంచి వెలువడే ‘ద సన్‌’ పేర్కొంది. వుహాన్‌ వైరస్‌ వెనక రహస్యాలను వెల్లడించేలా త్వరలో ఒక పుస్తకాన్ని వెలువరించనున్నారు.