🕑 Published: June 07, 2026 at 08:37 AM CST
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో బి.ఎస్.ఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ మినరల్ వాటర్ ప్లాంట్ గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
బి.ఎస్.ఆర్ మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు, ఆటా మాజీ అధ్యక్షుడు బూజల భువనేశ్వరరెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఉచితంగా నాణ్యమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ట్రస్ట్ కృషి చేస్తుందని చెప్పారు. గ్రామస్థులు ట్రస్ట్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.


