🕑 Published: June 07, 2026 at 07:02 PM CST
* కాలిఫోర్నియాలో ప్రప్రథమ అంతర్జాతీయ సంస్కృత సమ్మేళనం
నేటి ఆధునిక సాంకేతిక పరిశోధనలకు, కొత్త ఆవిష్కరణలకు సంబంధించిన మూలాలన్నీ మన వేదాల్లో, పురాణ గ్రంథాల్లో ఉన్నాయని వాటిని శాస్త్రీయంగా పరిశీలించాలంటే సంస్కృత భాష అధ్యయయనం అవసరమని ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. శనివారం నాడు కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో ఆరియా విశ్వవిద్యాలయం, శ్యామా సంస్థల సమ్యుక్త ఆధ్వర్యంలో సిలికానాంధ్ర సమావేశ మందిరంలో ప్రప్రథమ అంతర్జాతీయ సంస్కృత సమ్మేళనాన్ని నిర్వహించారు. దీనిలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ...1938లో రాజామహేంద్రవరానికి చెందిన దండిభట్ల విశ్వనాథశాస్త్రిని హిట్లర్ జర్మనీ తీసుకువెళ్లి క్షిపణులు, అణ్వాయుధాలకు సంబంధించిన వేదాల్లోని సూత్రాలను డీకోడ్ చేయించారని తెలిపారు. జర్మనీ విశ్వవిద్యాలయంలో విశ్వనాథశాస్త్రి చిత్రపటం ఉందని పేర్కొన్నారు. టిబెట్లోని వాంపాలో దొరికిన కొన్ని సంస్కృత గ్రంథాలను చైనా పరిశోధకులు చండీగఢ్ విశ్వవిద్యాలయ సంస్కృత పండితులచే డీకోడ్ చేయించి ఆధునిక క్షిపణుల తయారీకి వినియోగించారని వెల్లడించారు.
హిమాలయా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రకాశ్ దివకరన్ మాట్లాడుతూ సంస్కృత భాషలోని భాషాశాస్త్ర, వైద్య, సాంకేతిక విజ్ఞానం ఆధునిక జీవితానికి ఎంతో ఉపయుక్తమన్నారు. డా. కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ భారతదేశంలోని విద్యాసంస్థలు సంస్కృత భాషకు తగినంత ప్రాముఖ్యం ఇవ్వడం లేదనీ ఆవేదన వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో సిఈఓ రాజు చమర్తి, డాక్టర్ ప్రభాకర్ కల్వచర్ల, వెంకట్ గుడివాడ, డా. రేమిళ్ళ రామకృష్ణ శాస్త్రి, సత్యప్రియ తనుగుల, డా. అనుపమ ర్యాలీ, రాణీ సదాశివమూర్తి, శ్యామ్ సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్ సరిపెల్లె, రమా సరిపల్లే పాల్గొన్నారు.

