🕑 Published: August 09, 2026 at 08:02 PM CST
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం బే-ఏరియాలో తెలంగాణా రాష్ట్రానికి చెందిన ప్రవాస భారతీయులకు తెలంగాణా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నుండి నిరాశ ఎదురైంది. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (IOC) ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ప్రవాసులతో ఏర్పాటు చేసిన సమావేశాన్ని భట్టి ధృవీకరించకపోవడంతో దాన్ని రద్దు చేసినట్లు IOC రిజిస్టర్ చేసుకున్న ప్రవాసులకు ఈ-మెయిల్ పంపింది. 300మందికి పైగా ప్రవాసులు, ప్రత్యేకంగా భట్టి సొంత నియోజకవర్గం మధిర-ఖమ్మం ప్రాంతాలకు చెందిన అత్యధికులు ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వీరిలో ఉన్నట్టు సమాచారం. వీరంతా భట్టి వ్యవహారశైలి పట్ల ఆగ్రహాన్ని వెలిబుచ్చుతున్నారు. కాగా శాన్ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయంలో కాన్సుల్ జనరల్ డా. శ్రీకర్రెడ్డిని భట్టి కలుసుకున్నారు.

