🕑 Published: July 30, 2026 at 11:50 PM CST
న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో బోనాల జాతర వైభవంగా నిర్వహించారు. స్థానిక ఐసెన్ హోవర్ పార్క్ లో నిర్వహించిన ఈ వేడుకలు ప్రవాస తెలుగు కుటుంబాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల అధ్యక్షత వహించగా, కార్యవర్గమంతా ఉత్సాహంగా ఏర్పాట్లుచేసి విజయవంతం చేశారు. తెలంగాణ జానపద కళని ప్రతిబింబించేలా ప్రముఖ గాయకుడు రసమయి బాలకిషన్, సినీ గేయరచయిత కాసర్ల శ్యామ్, జానపద కళాకారుడు నల్లగొండ గద్దర్, రచయిత గాయకుడు మిట్టపల్లి సురేందర్, ప్రముఖ ఫోక్ సింగర్ సంధ్య యాట లు తమ అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. ఆట పాటలతో కార్యక్రమం అధ్యంతం సందడే సందడి.
ఆశోక్ చింతకుంట పోతురాజు ప్రదర్శన, పద్మ కోడెల తయారుచేసిన అమ్మవారి అలంకరణ, మహంకాళి గుడి, బోనాల తయారీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ బోనాల వేడుకల్లో డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి దంపతులు, నైటా కార్యవర్గ సభ్యులు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, పెద్ద సంఖ్యలో తెలుగు ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు పాల్గొని బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, జరుపుకున్నారు.
ఈ సందర్భంగా నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంతో పాటు విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికి తమ మూలాలను గుర్తు చేసే వేదికగా నైటా నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రవాస భారతీయుల్లో ఐక్యత, అనుబంధం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. వైస్ ప్రెసిడెంట్ హరిచరణ్ బొబ్బిలి, కార్యదర్శి మహేష్ దోమల, కోశాధికారి డా. సౌమ్య చిట్టారి, నైటా కార్యవర్గ సభ్యులు, చైర్మన్ డా.రాజేందర్ రెడ్డి జిన్నా, వైస్ చైర్మన్, లక్సమణ్ ఏనుగు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, సలహా కమిటీ సభ్యులు, దాతలు పాల్గొన్నారు.











