🕑 Published: July 27, 2026 at 11:20 AM CST
తానా సంస్థ సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలకు పైగా ‘నెల నెలా తెలుగు వెలుగు’ పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ప్రపంచంలోనే వైద్యశాస్త్రానికి ఆద్యుడు ‘మహర్షి సుశ్రుత’ అనే అంశం మీద ఆదివారం 94వ అంతర్జాల సమావేశం చాలా విజ్ఞానదాయకంగా జరిగింది. యూకేలో శస్త్రచికిత్స వైద్యనిపుణుడిగా ప్రసిద్ధిచెందిన డా.చంద్ర చెరువు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
తమ కుటుంబం తరఫున రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్లో శస్త్రచికిత్స పితామహుడు ఆచార్య సుశ్రుతిని 90 కిలోల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టమని డా.చంద్ర అన్నారు. ఈ ప్రయత్నంలో సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ‘మహర్షి సుశ్రుత ఏ కంపెండియం- ఫాదర్ ఆఫ్ సర్జరీ’ అనే గ్రంథంలో విలువైన వ్యాసాలను రాసి ప్రోత్సహించిన సహచర వైద్యమిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. సుశ్రుతుడు రచించిన ‘సుశ్రుత సంహిత’ ఇతర భాషల్లోకి అనువాదం కావాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య విద్యార్థులకు ఆయన పరిశోధనలు, ఆవిష్కరణలు స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు తాము అదే ప్రయత్నంలో ఉన్నామన్నారు.
తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా.ప్రసాద్ తోటకూర ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘సుశ్రుతుడు సంస్కృతంలో రచించిన 184 అధ్యాయాలుగా ఉన్న ‘సుశ్రుత సంహిత’ వైద్యులకు మొదటి ప్రామాణిక గ్రంథం. మనుషులకు వచ్చే వ్యాధులు, వాటిని నయం చేసే మొక్కల గురించి ఇందులో వివరించారు. ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసింది సుశ్రుతుడే! అనస్తీషియా ప్రక్రియకు ఆయనే ఆద్యుడు. కొన్ని క్లిష్ట పరిస్థితులలో ఆపరేషన్లు చేసే విధానం, వ్యాధిరహితంగా ఉండేందుకు ఏయే కాలాల్లో, ఎలాంటి కూరగాయలు, పండ్లు తినాలి? ఎలాంటి తృణధాన్యాలు, పప్పుదినుసులు వాడాలి? అనే సంపూర్ణ విజ్ఞానం అందించిన సుశ్రుతిని పరిశోధనా విశేషాలను ప్రాథమిక దశ నుంచే విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు.
విశిష్ట అతిథులుగా పాల్గొన్న డా. బుచ్చిబాబు పైడిపాటి (డెట్రాయిట్) సుశ్రుతుడు ఎంతో విపులంగా పేర్కొన్న మెడికల్ ఎథిక్స్ గురించి వివరించారు. సుశ్రుతుడు చేసిన కంటివైద్య పద్ధతుల గురించి డా. వి.కె రాజు (వెస్ట్ వర్జీనియా) పేర్కొన్నారు. సుశ్రుత సంహితలో వాత, పిత్త, కఫ దోష పరిస్థితులను ఎదుర్కోవడానికి సరైన ఆహరం, వ్యాయామం, నిద్ర అలవాట్లు ఎంత ముఖ్యమో డా. శేషు శర్మ (వాషింగ్టన్ డి.సి.) వివరించారు. సుశ్రుతుడు ప్రధానంగా ఆయుర్వేద చికిత్సా విధానం ఎలా పనిచేస్తుందో సుశ్రుత సంహిత గ్రంథంలో పేర్కొన్నారని డా.పండరి గంటి (లాస్ ఏంజిల్స్) తెలిపారు. అది నేటికీ ఫలవంతమైన చికిత్సేనని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, కార్యక్రమ విజయానికి సహకరించిన వారందరికీ తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు.

