🕑 Published: August 13, 2026 at 09:25 AM CST
ఇటీవల భారత ప్రభుత్వం నుంచి ‘పద్మ శ్రీ’ పురస్కారం అందుకున్న నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్కు అమెరికాలోని ఫిలడెల్ఫియా తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆగస్టు 9న పెన్సిల్వేనియాలోని చెస్టర్ స్ప్రింగ్స్ ‘బైయర్స్ స్టేషన్ క్లబ్ హౌస్’లో రవి పొట్లూరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాస తెలుగు ప్రజలు విశేష సంఖ్యలో హాజరయ్యారు. రాజేంద్ర ప్రసాద్ విలక్షణమైన నటనతో చిత్రపరిశ్రమలో దాదాపు 49 సంవత్సరాలుగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారని తెలుగు సంఘాల ప్రతినిధులు, అభిమానులు కొనియాడారు. హాస్యరస చిత్రాలతోపాటు ఎన్నో ఉత్తమ పాత్రలతో అలరించిన ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం తెలుగుజాతికే గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ నిర్వహిస్తున్న ఛారిటబుల్ ట్రస్ట్కు రూ.8 లక్షల విరాళం అందించారు. అనంతరం శాలువాలు, జ్ఞాపికలతో రాజేంద్ర ప్రసాద్ను ఘనంగా సన్మానించారు.
ప్రవాస తెలుగు ప్రజలు తనపై చూపిస్తున్న ఆప్యాయతకు, ప్రేమానురాగాలకు రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సముద్రాలు దాటి వచ్చినా తెలుగు ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే కన్నతల్లి ఒడిలో ఉన్నట్లుందన్నారు. మీ ప్రేమే నన్ను ఇన్నేళ్లుగా నటుడిగా ముందుకు నడిపిస్తోందని పేర్కొన్నారు. పద్మశ్రీ’ పురస్కారం తనకు లభించిన గౌరవం మాత్రమే కాదని, తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ చెందుతుందన్నారు. నటుడిగా తన 49 ఏళ్ల ప్రయాణంలో నవ్వులను పంచి, ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం కన్నా పెద్ద అవార్డు మరొకటి లేదన్నారు. ఈ కార్యక్రమానికి శ్వేత కొమ్మోజి వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. జగదీప్ రెడ్డి ఆనుముల, పరమేశ్ భీమ్ రెడ్డి, వేణు సంగాని, సతీష్ తుమ్మల, రామకృష్ణ తాడిశెట్టి, గిరిధర్ మసిరెడ్డి, వేణు కోమటిరెడ్డి, ఫణి కంతేటి, రాజు కక్కెర, సురేష్ వెంకన్నగారి, సునీల్ కోగంటి, వెంకట్ సింగు తదితరులు పాల్గొన్నారు.
