🕑 Published: August 07, 2026 at 01:26 PM CST
* డల్లాస్లో ఆటా 20వ మహాసభలు
జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) మహాసభలు-యువజన సదస్సు తెలుగు వైభవానికి పట్టం కట్టాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సభలు ఆదివారం నాడు ఘనంగా ముగిశాయి. ఉత్తర అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసులు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. సాహిత్య చర్చలు, విద్యా వేదికలు, శాస్త్రీయ–సమకాలీన సంగీతం, సంప్రదాయ–ఆధునిక నృత్యాలు, జానపద కళలు తెలుగు వారసత్వ వైభవాన్ని ప్రతిబింబించాయి.
మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్, మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గజాలా ఎఫ్. హష్మీ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు పాల్గొన్నారు. సాంకేతికత, వైద్యం, విద్య, పారిశ్రామికత, ప్రజాసేవలో తెలుగు, భారతీయ అమెరికన్ల సేవలను గవర్నర్ వెస్ మూర్ కొనియాడారు. అరుణా మిల్లర్ తన భారతదేశం నుంచి అమెరికన్ ప్రజాజీవితం వరకు సాగిన ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ పట్టుదల, విద్య, ప్రాతినిధ్యం, యువ నాయకత్వంపై స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు. హైదరాబాద్లో జన్మించిన గజాలా హష్మీ చార్మినార్, లాడ్ బజార్, హైదరాబాద్ బిర్యానీ, వరంగల్ ప్రయాణాల జ్ఞాపకాలను పంచుకున్నారు. తెలంగాణా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడులు, ఆవిష్కరణలు, ఉద్యోగ కల్పన, మౌలిక వసతులు, సాంకేతిక భాగస్వామ్యాల అవకాశాలను వివరించి, ప్రవాస పారిశ్రామికవేత్తలు రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని కోరారు. అమెరికా సాయుధ దళాల్లో సేవలందిస్తున్న తెలుగు మూలాలు కలిగిన వ్యక్తులను వేదికపై సత్కరించారు. తానా, నాట్స్, టీటీఏ, టీడీఎఫ్, ఏఏపీఐ ప్రతినిధుల పాల్గొన్నారు.
వ్యాపార వేదికల్లో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, కార్పొరేట్ నాయకులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, యువ వృత్తి నిపుణులు పాల్గొన్నారు. సాంకేతికత, వైద్యం, స్థిరాస్తి, కృత్రిమ మేధ, ఆర్థిక సేవలు, ఆతిథ్య రంగం, ఔషధాలు, స్టార్టప్ అభివృద్ధి, భారత్–అమెరికా ఆర్థిక సహకారంపై చర్చలు జరిగాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు; నటులు అడివి శేష్, రాజేంద్ర ప్రసాద్, మురళీధర్ గౌడ్, వరుణ్ సందేశ్, నవీన్ పోలిశెట్టి; నటీమణులు పూజా హెగ్డే, రీతూ వర్మ, అనన్య నాగళ్ల, దివి వడ్త్యా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, గాయని సునీత, త్రీయరీ, ఆరెంజ్ స్ట్రీట్తో పాటు పలువురు గాయకులు, వాద్యకారుల ప్రదర్శనలు ఉత్సాహభరిత సంగీత వాతావరణాన్ని సృష్టించాయి. గేయరచయిత, గాయకులు కాసర్ల శ్యామ్, మిట్టపల్లి సురేందర్, సాంస్కృతిక కళాకారుడు రసమయి బాలకిషన్, జానపద గాయకుడు జనార్దన్ పన్నెల తెలంగాణ జానపద గీతాలను ఆలపించారు. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ప్రత్యక్ష సంగీత విభావరి మూడు రోజుల వేడుకలకు ఘన ముగింపునిచ్చింది.
ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా నాయకత్వంలో, మహాసభల కన్వీనర్ శ్రీధర్ బానాల పర్యవేక్షణలో భారీ కార్యక్రమం సమర్థంగా నిర్వహించబడింది. సతీష్ రెడ్డి రామసహాయం, కోర్ కమిటీ సభ్యులు రవి చల్లా, శరత్ వేముల, సుధీర్ దామిడి, అరవింద్ ముప్పిడి, జీనత్ కుందూర్, కౌశిక్ సామ, తిరుమల్ మునుకుంట్ల, కిరణ్ ఆలతో పాటు బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, కార్యనిర్వాహక నాయకత్వం, సలహా బృందాలు సహకరించారు. మహాసభల ముగింపు సందర్భంగా 2028లో జరగనున్న 20వ ఆటా మహాసభలకు డల్లాస్ను ఆతిథ్య నగరంగా ప్రకటించారు.





























