ప్రఖ్యాత సినీ కవి వేటూరి సుందరరామమూర్తి సాహిత్యం అద్వైత సిద్ధిని అమరత్వ లబ్ధిని పొందిందని వేద కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఫ్రిస్కోలోని మెమోరియల్ హైస్కూల్లో వేటూరి సాహిత్యాభిమాన సమితి ఆఫ్ అమెరికా-శుభం ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో "కవికులాలంకార" వేటూరి సుందరరామమూర్తి సాహితీ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించి ఆయన రచించిన సినీ, సినీయేతర గీతాల సంపుటాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జొన్నవిత్తుల వేటూరి వద్ద శిష్యరికం చేసిన జ్ఞాపకాలను సభికులతో పంచుకున్నారు.
కవుల్లో వివేకుడు, వాచకుడు, రౌచికుడు, ఆర్థికుడు, శిల్పి, భూషణార్ధి, మార్దవకవి అని ఏడు రకాలు ఉంటారని కానీ ఏడుగురు ఒకే వ్యక్తిలో ప్రస్ఫుటిస్తే అది వేటూరి అని ఆయన పేర్కొన్నారు. ఆయన రచనలు కొన్నింటినీ హాస్యభరితంగా విశ్లేషించారు. మద్రాసులో ఆయన వద్ద శిష్యరికం చేసే రోజుల్లో జరిగిన సంఘటనలను, తన వివాహానికి ఆయన చేసిన సాయాన్ని వివరించారు. సమ్మోహనభరితంగా, వినసొంపుగా, అర్థవంతంగా, వేగవంతంగా పాట నిర్మాణం చేసే ఆయన శైలి అసాధ్యమని కొనియాడారు. ఒకరోజులో 11 పాటలు వ్రాసిన ఘనత ఆయన సొంతమన్నారు. భారతదేశవ్యాప్తంగా సినీరచయితల్లో ఆర్జనను పరిగణలోకి తీసుకుంటే ఆయన సమయంలో అత్యంత ధనిక రచయితగా రికార్డు నెలకొల్పారన్నారు. బిల్ క్లింటన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు పత్రికలో శీర్షిక కోసం వేటూరిని సంప్రదించగా "తెలుగింటన్ బిల్ క్లింటన్" అని సూచించి ఆయనలోని పాత్రికేయ ప్రతిభను ప్రకటించుకున్నారని తెలిపారు.
వేటూరి సాహిత్యాభిమాన సమితి ఆఫ్ అమెరికా వ్యవస్థాపకుడు డా. తోటకూర ప్రసాద్ వేటూరితో తన అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. నిగర్వి, మృదుస్వభావి అయిన వేటూరి 1983లో, 2000లో అమెరికా పర్యటన విషయాలను అతిథులతో పంచుకున్నారు. రూ. 40లక్షల ఖర్చుతో రూపొందించిన ఈ సాహితీ సంకలనాల విడుదలకు సహకరించిన ప్రవాస దాతలను శుభం ఫౌండేషన్ నిర్వాహకుడు పొణంగి గోపాల్తో కలిసి సత్కరించారు. అనంతరం సాహితీ సంపుటాలను విడుదల చేశారు. వేటూరి కుటుంబసభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. 2004వ సంవత్సరంలో తన సాహిత్యాన్ని పుస్తకరూపంలోకి తీసుకురావాలనుకున్న వేటూరి ఆలోచన 22ఏళ్ల తర్వాత కార్యరూపం దాల్చడం ఆనందంగా ఉందని వేటూరి కుటుంబసభ్యులు పంపిన సందేశంలో పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా స్థానిక కళాకారుల నృత్య, సంగీత, వాయిద్య ప్రదర్శనలు అలరించాయి. పాన్ అమెరికావ్యాప్తంగా నిర్వహించిన చదరంగ పోటీల్లో గెలుపొందిన 8ఏళ్ల ప్రవాసాంధ్ర బాలిక సరయును ఈ సందర్భంగా సత్కరించారు. సాహితీవేత్త వామరాజు సత్యమూర్తి, కె.రామాచారి, టెక్సాస్ స్టేట్ రిప్రజెంటేటివ్ మేట్ షహీన్, ఫ్రిస్కో మేయర్ మార్క్ హిల్, ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ సభ్యురాలు యాన్ యాండర్సన్, వెన్నం మురళీ, ఉప్పు వినోద్, రాజేష్ అడుసుమిల్లి, నలజుల నాగరాజు, డా. యు. నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.