తానా బ్రాండ్ ఇనుమడించేలా డెట్రాయిట్ మహాసభలు-TNIతో సభల ఛైర్మన్ నాదెళ్ల గంగాధర్

Featured Image

* 10వేల మంది అతిథులు హాజరవుతారని అంచనా

* యువతకు పెద్దపీట

* $2 మిలియన్ డాలర్ల నిధుల సేకరణ లక్ష్యం

* ప్రధాన వేదికపై అన్ని పార్టీల రాజకీయ నాయకులతో మాక్ అసెంబ్లీ

* తానా బ్రాండ్ ఇనుమడించేలా ప్రణాళిక

* 300 మంది వాలంటీర్ల నిరంతర శ్రమ

* తానా చరిత్రలో మూడొంతులు డెట్రాయిట్‌తో అనుబంధం

* డెట్రాయిట్‌లో నాలుగోసారి తానా సభలు.

* మొదటి తానా సభ జరిగింది కూడా డెట్రాయిట్‌లోనే

1977లో స్థాపించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అంటే ఉత్తర అమెరికాలో అదొక క్రేజ్, ఒక బ్రాండ్, ఒక పెద్దన్న, ఒక మార్గదర్శి. ఈ బ్రాండ్ విలువ ప్రతిబింబించేలా, ఇనుమడించేలా 2025 జులై 3,4,5 తేదీల్లో జరిగే తానా 24వ ద్వైవార్షిక మహాసభలను నిర్వహించడానికి కృషి చేస్తున్నట్లు సభల ఛైర్మన్ నాదెళ్ల గంగాధర్ TNIకు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో వెల్లడించారు. 'తరతరాల తెలుగుదనం-తరలివచ్చే యువతరం' నినాదం ప్రధాన ఉద్దేశంగా ఈ ఏడాది సభలను నిర్వహిస్తున్నారు. తొలి తానా మహాసభ 1979లో డెట్రాయిట్‌లోనే జరిగిందన్న ఆయన 48ఏళ్ల సంస్థ సుదీర్ఘ చరిత్రలో 16ఏళ్లు అంటే మూడొంతులు డెట్రాయిట్‌తోనే అనుబంధం ఏర్పరుచుకుందని సాగిందని...అందుకు గర్వంగా ఉందని గంగాధర్ తెలిపారు.

2వ అధ్యక్షుడు తుమ్మల మాధవరావు, కాకరాల చంద్రశేఖర్, బీవీ రావు, నల్లమోతు సత్యనారాయణ (రెండు సార్లు), నాదెళ్ల గంగాధర్, బండ్ల హనుమయ్య, నిరంజన్ శృంగవరపు వెరసి మొత్తం 8మంది అధ్యక్షులు 16సంవత్సరాల పాటు డెట్రాయిట్ నుండి తానాకు సేవ చేశారని గంగాధర్ గుర్తు చేసుకున్నారు. 1979, 2005, 2015 తర్వాత మళ్లీ 2025 సభలకు డెట్రాయిట్ వేదిక కావడం ముదావహమన్నారు.

ఈ ఏడాది జరిగే సభలకు 10వేల మంది అతిథులు హాజరవుతారనే అంచనా వేశామని తెలిపారు. అతిథులకు తెలుగు సంస్కృతి, సాంప్రదాయం, సాహితీ వైభవాన్ని మరోసారి పరిచయం చేసేందుకు 300మంది వాలంటీర్లు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని గంగాధర్ తెలిపారు. ప్రవాసులు ఎక్కువగా ఉండే నోవైలో ఈ సారి కన్వెన్షన్ సెంటరును ఏర్పాటు చేశామని, కేవలం ఇండియా నుండి వచ్చే ఎగ్జిబిటర్లు కాకుండా స్థానిక ప్రవాస వ్యాపారాలకు కూడా ఈసారి వేడుకల్లో తమ వ్యాపారాన్ని ప్రదర్శించేందుకు అవకాశాలను కల్పించినట్లు తెలిపారు. ప్రవాస యువతకు ఈ సభల్లో పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. పలు కార్యక్రమాల్లో ప్రవాస యువతీయువకులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోవచ్చునని పేర్కొన్నారు.

సహజంగా 3 నుండి 4 మిలియన్ డాలర్లు ఖర్చు ఉండే తానా సభలు ఈసారి $2మిలియన్ డాలర్లతో ఏ మాత్రం తగ్గకుండా పూర్వపు కన్వెన్షన్ల కన్నా మించి బ్రహ్మాండంగా నిర్వహిస్తామని గంగాధర్ ధీమా వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణాన్ని కూడా వివరించారు. పెద్ద నగరాల్లోని డౌన్‌టౌన్‌లో నిర్వహించే మహాసభలకు లేబర్ ఛార్జీలు అధికంగా ఉంటాయని, ఈ సారి 2025 తానా సభలు డెట్రాయిట్ పరిసర ప్రాంతమైన నోవైలో చేస్తున్నందున సబర్బన్ ప్రాంతంలో లేబర్ ఛార్జీలు తక్కువ ఉంటాయని అన్నారు. కాబట్టి సభల ఖర్చు గణనీయంగా తగ్గించుకోగలిగామని అన్నారు.

రాజకీయ, వ్యాపార, వైద్య, విద్య, సాహితీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులతో 42 చర్చా వేదికలు 4,5 తేదీల్లో ఏర్పాటు చేశామని తెలిపారు. మూడో తారీఖు బ్యాంక్వెట్‌లో పలు రంగాలకు చెందిన లబ్ధప్రతిష్ఠులైన వారికి తానా పురస్కారాలు అందజేస్తామని వెల్లడించారు. 4వ తేదీ ఉదయం స్థానిక కళాకారులచే స్వాగత నృత్యం ఉంటుందని, 5వ తేదీన థమన్ సంగీత విభావరితో విజయవంతంగా ముగిస్తామని ఆయన తెలిపారు. ప్రధాన వేదికపై తెలుగు రాష్ట్రాల నుండి అతిథులుగా వచ్చిన అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులతో మాక్ అసెంబ్లీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అమరావతిలో పెట్టుబడుల పెట్టే ఆసక్తి కలిగిన ప్రవాసులు రాజకీయ నాయకులను అడిగి తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చునని సూచించారు.

అన్ని తరాల తెలుగువారు భావితరంతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయవల్సిందిగా నాదెళ్ల గంగాధర్ కోరారు. మరిన్ని వివరాలకు www.tanaconference.org చూడవల్సిందిగా సూచించారు.

Tags-TNI Special Interview With Nadella Gangadhar TANA Conference2025 Chairman

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles