🕑 Published: June 23, 2026 at 10:32 AM CST
తండ్రి కష్టానికి, త్యాగానికి ప్రతిరూపమే ఫాదర్స్ డే అని టీటీడీ పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్ అన్నారు. తానా-పాఠశాల ఆధ్వర్యంలో అమెరికా రాజధాని ప్రాంతంలోని వర్జీనియాలో ఫాదర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీటీడీ పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్, తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన, మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తానా- పాఠశాల చైర్మన్ భాను మాగులూరి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా మల్లెల రాజశేఖర్ మాట్లాడుతూ.. తండ్రి అంటే కేవలం ఒక వ్యక్తి కాదని, ఒక కుటుంబానికి బలమైన ఆధారం, మార్గదర్శి, రక్షకుడని అన్నారు. ఎన్నారైలకు, వారి కుటుంబ సభ్యులకు వంద టికెట్లు జారే చేస్తున్నామన్నారు. అలాగే అమెరికాలోని ఆరు నగరాలలో శ్రీనివాస కల్యాణం జరిపించాలని నిర్ణయించామని తెలిపారు.
తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన మాట్లాడుతూ జీవితంలో ప్రతి అడుగులోనూ మనకు ధైర్యం, క్రమశిక్షణ, బాధ్యత, విలువలను నేర్పించే మొదటి గురువు తండ్రేనని చెప్పారు. అందుకే తండ్రిని గౌరవించడం, ప్రేమించడం, ఆయన చేసిన త్యాగాలను గుర్తుంచుకోవడం పిల్లల బాధ్యత అని తెలియజేశారు. మాతృబాష తెలుగును సమిష్టిగా పరిరక్షించుకుందామని పిలుపునిచ్చారు.
మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ తల్లి ప్రేమను వ్యక్తపరుస్తే, తండ్రి ప్రేమను తన కష్టాల ద్వారా చూపిస్తాడని చెప్పారు. కుటుంబం సంతోషంగా ఉండాలని తన సుఖాలను త్యాగం చేస్తూ, పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించే మహానుభావుడు తండ్రి అని ప్రశంసించారు. మన విజయాల వెనుక తండ్రి కష్టం, త్యాగం, ఆశీర్వాదం దాగి ఉంటాయన్నారు. మనం ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కనే మొదటి వ్యక్తి కూడా తండ్రేనన్నారు.
భాను మాగులూరి మాట్లాడుతూ ఫాథర్స్ డే కార్యక్రమం సందర్భంగా హాజరైన తల్లిదండ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మాతృభూమి, మాతృబాష రెండుకళ్లుగా భావించే ప్రవాస భారతీయులందరి జీవితాలలో తండ్రిది అగ్రస్థానమని అన్నారు. తండ్రి ఉన్నాడనే ధైర్యం, ఉంటారనే నమ్మకం సంతానాన్ని ముందుకు నడిపిస్తుందని చెప్పారు. తండ్రి పిల్లల్ని భుజం తట్టి గుండెకు హత్తుకుని చెప్పే అనుభవాలు జీవితకాల పాఠాలని, ఎన్నటికీ వదలని చేయి నాన్న అని వ్యాఖ్యానించారు.


