🕑 Published: June 19, 2026 at 03:10 PM CST
ఆధునిక వైద్య రంగంలో ఫార్మసిస్టుల పాత్ర రోజు రోజుకూ విస్తరిస్తోందని కురసావు(కరేబీయన్) సెయింట్ మార్టినస్ యూనివర్సిటీ అధ్యక్షుడు డాక్టర్ మురళీచంద్ గింజుపల్లి అన్నారు. నగరంలోని కేవీఎస్ఆర్ సిద్ధార్థ ఫార్మసీ కళాశాల ఫార్మాస్యూటిక్స్, బయోటెక్నాలజీ విభాగాల ఆధ్వర్యంలో గురువారం “ఫ్రమ్ ఫార్మసీ టు హెల్త్ కేర్ లీడర్షిప్: ది నెక్స్ట్ రివల్యూషన్ ఇన్ మెడిసిన్” అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న మురళీచంద్ మాట్లాడుతూ రోగి సంరక్షణ, ఔషధ అభివృద్ధి, క్లినికల్ పరిశోధనలు, ప్రజారోగ్య సేవలు వంటి రంగాల్లో ఫార్మసిస్టులు కీలక నాయకత్వ బాధ్యతలు చేపడుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఫార్మసిస్టులు కేవలం ఔషధ నిపుణులుగానే కాకుండా ఆరోగ్య విధాన రూపకర్తలు, పరిశోధకులు, వైద్య రంగ నాయకులుగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్భంగా ఒకరికొకరు పరిజ్ఞానాన్ని పంచుకునేలా సిద్ధార్థ ఫార్మసీ కళాశాల మరియు సెయింట్ మార్టినస్ యూనివర్సిటీ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎ. సునీత, ఫార్మాస్యూటిక్స్ హెచ్ఓడీ డాక్టర్ జి. రమణ తదితరులు పాల్గొన్నారు.


