🕑 Published: July 05, 2026 at 04:56 PM CST
ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ శాఖల్లో అమలవుతున్న సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను సమీక్షించి, రాష్ట్ర ప్రభుత్వ డేటా భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలతో సచివాలయంలో APTS ఆధ్వర్యంలో నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ వర్క్షాప్లో ముఖ్య అతిధిగా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (APTS )ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ పాల్గొన్నారు. “రాష్ట్ర డేటా భద్రత కోసం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వ్యవస్థల్లో సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ల బలోపేతం” అంశంపై ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఈ వర్క్ షాప్ APTS నిర్వహించింది.
ఈ సందర్భంగా మన్నవ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ సేవలను వేగంగా డిజిటలైజ్ చేస్తోందని, ఈ నేపథ్యంలో పౌరుల వ్యక్తిగత సమాచారం, ఆరోగ్య వివరాలు, విద్య, భూ రికార్డులు, సంక్షేమ పథకాలు, ఆర్థిక లావాదేవీల వంటి అత్యంత కీలకమైన ప్రభుత్వ డేటాను రక్షించడం ప్రభుత్వ అత్యున్నత బాధ్యతగా మారిందని మోహనకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ శాఖ ప్రస్తుతం సైబర్ భద్రతను ఏ విధంగా అమలు చేస్తోంది, ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటోంది, వాటిని అధిగమించేందుకు ఎలాంటి ఆధునిక భద్రతా వ్యవస్థలు అవసరమనే అంశాలపై ఈ వర్క్షాప్లో విస్తృతంగా చర్చించినట్లు మన్నవ మోహనకృష్ణ తెలిపారు. అన్ని శాఖల్లో అత్యుత్తమ సైబర్ సెక్యూరిటీ ప్రమాణాలు అమలు చేయడం, డేటా భద్రతను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ను మరింత బలోపేతం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యమని మోహనకృష్ణ అన్నారు.
సైబర్ దాడుల స్వరూపం రోజురోజుకూ మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వ శాఖలు సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవడంతో పాటు నిరంతర పర్యవేక్షణ, శిక్షణ, అవగాహన, వేగవంతమైన స్పందన వ్యవస్థలపై కూడా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. సురక్షితమైన డిజిటల్ పాలన ద్వారా ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. భారతదేశంలో సైబర్ మోసాలు అరికట్టటానికి, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయము చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో సమీక్షలు నిర్వహిస్తోందని, ఆంధ్రప్రదేశ్ లో కూడా నేషనల్ సైబర్ సెక్యూరిటీ టీం తో కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆగస్టు నెలలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దేశావ్యాప్త సైబర్ సెక్యూరిటీ సదస్సు సన్నాహల్లో భాగంగా అన్ని ప్రభుత్వ శాఖల సైబర్ భద్రత ప్రమాణాలను సమీక్షిస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ డేటా భద్రతను మరింత బలోపేతం చేయడం, అన్ని ప్రభుత్వ శాఖల్లో ఏకరీతి సైబర్ సెక్యూరిటీ ప్రమాణాలను అమలు చేయడం, కీలక డిజిటల్ మౌలిక వసతుల రక్షణ, భారతదేశం లోని రాష్ట్రాల మధ్య ఉత్తమ విధానాల మార్పిడి, జాతీయ స్థాయిలో సమన్వయంతో సైబర్ భద్రతా కార్యాచరణ రూపొందించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వ శాఖల్లో నిరంతర సైబర్ భద్రతా పర్యవేక్షణ, రిస్క్ అసెస్మెంట్, స్టేట్ డేటా సెంటర్లు, SWAN నెట్వర్క్ల భద్రత, సైబర్ ఘటనలకు వేగవంతమైన స్పందన వ్యవస్థలు, పాత అప్లికేషన్ల ఆధునికీకరణ, డేటా రక్షణ, గోప్యతా ప్రమాణాలు, అన్ని శాఖల్లో CISOల నియామకం, అధికారులకు సైబర్ భద్రతపై శిక్షణ, అవగాహన కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
వర్క్షాప్లో రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులు తమ శాఖల్లో అమలవుతున్న సైబర్ సెక్యూరిటీ విధానాలను ప్రజెంటేషన్ల రూపంలో వివరించగా, అనంతరం ఆరు గ్రూపులుగా విభజించి ఆయా అంశాలపై సవివరంగా చర్చించారు. గ్రూపుల నుంచి వచ్చిన సూచనలు, సిఫార్సులను సమగ్రంగా సమీక్షించి భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ సైబర్ భద్రతా విధానాన్ని మరింత సమర్థవంతంగా రూపొందించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సందర్భంగా APTS మేనేజింగ్ డైరెక్టర్ మల్లవరపు సూర్యతేజ గారు ఈ సదస్సులో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో సైబర్ భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పాటు అధికారులకు నిరంతర శిక్షణ, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం అవసరమని తెలిపారు. ప్రభుత్వ డేటా భద్రత, సురక్షిత డిజిటల్ పాలన లక్ష్యంగా అన్ని శాఖలతో సమన్వయంతో APTS నిరంతరం పనిచేస్తోందని సూర్యతేజ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇంకా ఏపీ ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీ సందీప్ కృపాకర్ గుండాల IFS, సైబర్ క్రైమ్స్ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ అదిరాజ్ సింగ్ రానా IPS, Head of SEMT & NEGD Madhan Raj మరియు రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖల ఉన్నతాధికారులు, కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY), CERT-In, NIC ప్రతినిధులు, APTS సైబర్ సెక్యూరిటీ నిపుణులు పాల్గొన్నారు.



