🕑 Published: June 26, 2026 at 01:46 PM CST
లండన్లో తెలంగాణకు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన సావుసాని శ్రీనాథ్ రెడ్డి (25) రెండు రోజుల క్రితం అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం శ్రీనాథ్ గతేడాదే లండన్కు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. మధుసూదన్ రెడ్డి, మంజుల దంపతుల కుమారుడు శ్రీనాథ్ రెడ్డి లండన్లోని లీసెస్టర్ యూనివర్సిటీలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
రెండు రోజుల క్రితం స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన శ్రీనాథ్.. రాత్రి అక్కడే నిద్రించాడు. తెల్లవారేసరికి విగతజీవిగా పడి ఉన్నట్లు స్నేహితులు అక్కడే ఉన్న శ్రీనాథ్ బంధువులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకొని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈ మరణ వార్తతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తమ కుమారుడు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. శ్రీనాథ్ మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
