🕑 Published: July 05, 2026 at 04:50 PM CST
సృజనాత్మకతను వెలికితీయడమే లక్ష్యంగా నాట్స్ సంస్థ ఆన్లైన్ ఆర్ట్ వర్క్ షాప్ ఉచితంగా నిర్వహించింది. నాట్స్ మేరీల్యాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ ఉచిత ఆన్లైన్ ఆర్ట్ వర్క్షాప్ కళాభిమానులను ఆకట్టుకుంది. చెన్నైకి చెందిన ప్రముఖ చిత్రకారుడు గోపీకృష్ణమూర్తి ఈ వర్క్షాప్లో చిత్రకళపై శిక్షణ ఇచ్చారు. కళారంగంలో 17 ఏళ్ల సుదీర్ఘ అనుభవం, అనేక పురస్కారాలు అందుకున్న ఆయన పెన్సిల్ డ్రాయింగ్లోని మెళకువలను సులభంగా, దశలవారీగా వివరించారు. ఆయన బోధనాశైలి పట్ల శిక్షణలో పాల్గొన్న విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కళాభిమానులు ఈ వర్క్షాప్లో భాగస్వాములయ్యారు. 5-13 సంవత్సరాల వయస్సు గల 30 మంది చిన్నారులు పెన్సిల్ డ్రాయింగ్లో ప్రాథమికాంశాలను ఉత్సాహంగా నేర్చుకున్నారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. నాట్స్ మేరీల్యాండ్ చాప్టర్ సభ్యులు వాకుల్ మోరే, విశ్వ మార్ని, హారిణి నర్ల, సువర్ణలు కీలకపాత్ర పోషించారు. నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, అధ్యక్షుడు రాజ్ అల్లాడలు మేరీల్యాండ్ ఛాప్టర్ను అభినందించారు.
